కాంగ్రెస్కు భారీ షాక్, టీఆర్ఎస్లోకి సురేష్ రెడ్డి: స్పీడ్గా వెళ్తోంది, కారు డ్రైవర్ను మార్చొద్దు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగాలంటే తెలంగాణలో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలని మాజీ సభాపతి సురేష్ రెడ్డి శుక్రవారం చెప్పారు. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఇతర తెరాస నేతలు ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. తాను తెరాసలో చేరుతున్నట్లు మాజీ స్పీకర్ చెప్పారు. అధికారికంగా 12వ తేదీన చేరనున్నారు.
బాబు మోహన్కు షాక్, నో టిక్కెట్, కొండా సురేఖకు డౌట్: దరిద్రులంటూ వారిపై కేసీఆర్ ఫైర్
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తాను రాజకీయ ప్రయోజనాలను ఆశించి పార్టీ మారడం లేదన్నారు. కేసీఆర్ నిన్ననే (గురువారం) దాదాపు అన్ని నియోజకవర్గాలకు టిక్కెట్లను ప్రకటించారని సురేష్ రెడ్డి తెలిపారు. తాను వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు తెరాసలో చేరడం లేదన్నారు. తెలంగాణకు క్రిటికల్ సమయంలో తాను తెరాసలో చేరుతున్నానని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తెరాసలో చేరడం కాంగ్రెస్కు పెద్ద షాక్.
వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ను మార్చాల్సిన అవసరం లేదు
ఇప్పుడు అమలవుతున్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు ముందుకు వెళ్లాలంటే తెరాస ప్రభుత్వం కొనసాగాలని సురేష్ రెడ్డి అన్నారు. అందుకే అన్నింటిని గమనించిన వ్యక్తిగా తాను తెరాసలో చేరుతున్నానని చెప్పారు. తన రాజకీయ అవసరాల కంటే ఇక్కడి పథకాలు ముఖ్యమని వారు చెప్పారని, తన సహకారం కూడా అవసరమని చెప్పారని, వేగంగా వెళ్తున్న కారుకు మధ్యలో డ్రైవర్ను మార్చాల్సిన అవసరం లేదని, అభివృద్ధి పనులు మధ్యలో ఆపకుండా ఉండేందుకు తాను తెరాసలో చేరుతున్నానని చెప్పారు.
Recommended Video
కేసీఆర్ పిలుపుమేరకు వచ్చా
తెలంగాణలో అభివృద్ధి వేగంగా కొనసాగాల్సి ఉందని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సురేష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి ఆగిపోకూడదనే ఈ నిర్ణయంతీసుకున్నానని చెప్పారు. కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటానని చెప్పారు. 1989 నుంచి కేసీఆర్తో నేరుగా పని చేయలేకపోయినా, ఆయన ఆలోచన విధానాన్ని గమనిస్తూ వచ్చానని చెప్పారు.
పార్టీలు వేరైనా, భావాలు ఒక్కటే
కేఆర్ సురేష్ రెడ్డి స్పీకర్ సహా పలు పదవుల్లో పని చేశారని అంతకుముందు మాట్లాడిన కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాడాలనే ఆలోచన కూడా ఆయనకు ఉండేదన్నారు. పార్టీలు వేరైనా, భావాలు ఒక్కటే అన్నారు. నేడు తెలంగాణలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కలిసి పని చేద్దామని అడిగితే, ఆలోచిస్తామని చెప్పారన్నారు.
పార్టీలోకి ఆహ్వానించాం
సురేష్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఆయనను ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి వచ్చామని, మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన పార్టీలోకి వస్తామని చెప్పారన్నారు. వారి స్థాయికి తగినట్లుగా ఆయనను గౌరవించుకుంటామని చెప్పారు. 1989 నుంచి కేసీఆర్, సురేష్ రెడ్డి మిత్రులు అన్నారు. ఆయనకు కేసీఆర్ తగిన గౌరవం ఇస్తారన్నారు.