మీ బాధ్యత కాదా, మంత్రి ఏం మాట్లాడారు?: సభలో ఊగిపోయిన లక్ష్మణ్
హైదరాబాద్: రైతు ఆత్మహత్యల పైన శాసన సభలో చర్చ సందర్భంగా బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ బుధవారం ఊగిపోయారు. ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మంత్రుల పైన మండిపడ్డారు. పరామర్శిస్తే కష్టాలు తొలగుతాయా అని చెప్పిన మంత్రి వల్ల రైతుకు ఎలాంటి విశ్వాసం కలుగుతుందన్నారు.
మంత్రులు అసెంబ్లీ నడిబొడ్డున ఆత్మహత్య చేసుకున్న రైతు లింబయ్య గురించి అమానుషంగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. లింబయ్య స్థితిగతులు బాగానే ఉన్నాయని, కొడుకు ఆసుపత్రిలో ఉండటం వల్లనే ఆత్మహత్య అంటే అవమానం కాదా అని నిలదీశారు.
రైతులను అవమానించవద్దని, వారిలో విశ్వాసం కల్పించాలన్నారు. నాలుగేళ్ల వరకు రైతులు చనిపోతే మా బాధ్యత కాదంటారా అని ప్రశ్నించారు. మంత్రుల తీరుతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.
పరామర్శిస్తే కష్టాలు పోతాయా అని చెప్పారని, అలా చెప్పిన మంత్రి రైతుల్లో విశ్వాసం ఎలా కల్పిస్తాడన్నారు.అవమానం చేసిన మంత్రి వల్ల రైతుకు న్యాయం జరగదన్నారు. ముఖ్యమంత్రి రావాల్సిందేనని చెప్పారు.
అంతకుముందు కిషన్ రెడ్డి మాట్లాడుతూ... వ్యవసాయ రంగానికి పాడి, పంట రెండు కావాలన్నారు. నేటితో ఖరీఫ్ ముగిసిందని రబీలో నైనా రైతులకు రుణాలు ఇవ్వాలంటే రైతు రుణాలను వన్టైమ్ సెటిల్మెంట్ చేయాలన్నారు. అప్పుల బాధలు తట్టుకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.
పాడిని కాపాడాలన్నారు. నగరంలో రోజుకు అనుమతికి మించి పశువులను వధిస్తున్నారని పశు సంపదను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయానికి పాడి, పంట రెండు అవసరమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు.
ధైర్యం చెప్పాం: హరీష్ రావు
విపక్షాలు రైతుల ఆత్మహత్యల పైన అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. బిజెపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రైతుల పైన చేసిన వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే రైతు యూనిట్గా భీమా పథకం వర్తింప చేసేలా కేంద్రాన్ని కోరాలన్నారు.
వ్యవసాయరంగానికి ఉపాధి హామీని అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని, దానిపై కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. రైతులకు ధైర్యం చెప్పేందుకే మేం వారితో కలిసి సహఫంక్తి భోజనం చేశామన్నారు.