మరోసారి అరెస్ట్: చంచల్గూడ జైలుకు మాజీ తహసీల్దార్ లావణ్య
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో కేశంపేట మాజీ తహసీల్దార్ లావణ్యను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మరోసారి అరెస్ట్ చేశారు. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఆమెను మంగళవారం హాజరుపర్చారు.
కేసు విచారించిన న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. విచారణ అనంతరం లావణ్యను చంచల్ గూడ మహిళా కారాగారానికి తరలించారు అధికారులు. రైతు నుంచి లంచం తీసుకున్న కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న లావణ్య ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా, మరోసారి అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పర్చారు. కోర్టు ఆదేశాల మేరకు మరోసారి చంచల్ గూడ జైలుకు తరలించారు. లంచం తీసుకున్న కేసులో ఆమె నివాసంపై దాడి చేసిన ఏసీబీ అధికారులు రూ. 93 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
గతంలో ఉత్తమ తహసీల్దారుగా ప్రభుత్వ అవార్డు పొందిన లావణ్య.. పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడటం గమనార్హం. ఇది ఇలావుంటే, లావణ్య భర్త కూడా ఇటీవల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. జీహెచ్ఎంసీలో సూపరింటెండెంట్గా పనిచేసే లావణ్య భర్త వెంకటేశ్వర నాయక్.. రణధీర్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నాడు.
ఆర్డీఎంఏ కార్యాలయంలో పొరుగుసేవల ఉద్యోగిగా నియమించేందుకు ఆయన లంచం డిమాండ్ చేశారు. రూ. 2.5లక్షలు లంచం సొమ్మును బ్యాంక్ ఖాతా ద్వారా తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మరో 40వేలు అదనంగా లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అతని బాగోతం బట్టబయలైంది. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.