జనసేనానితో భేటీ: పవన్ పార్టీలోకి మోత్కుపల్లి నర్శింహులు..?
Recommended Video
ఏపీలో చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించిన తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలవనున్నారు. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత మోత్కుపల్లి రాజకీయ ప్రస్థానంపై స్పష్టత రాలేదు. లోగడ వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డి కూడా మోత్కుపల్లిని తన నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించారు. దీంతో తెలంగాణ వైసీపీలోకి మోత్కుపల్లి అంటూ పలు ఊహాగానాలు వినపడ్డాయి.
గురువారం సాయంత్రం మోత్కుపల్లి పవన్ కళ్యాణ్ను కలవనున్న నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో మోత్కుపల్లి జనసేన పగ్గాలు చేపడుతారనే వార్తలు జోరందుకున్నాయి. అంతేకాదు విశేష రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా... తెలంగాణ రాజకీయాల్లో పట్టున్న నేతగా మోత్కుపల్లికి మంచి పేరుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లికి తెలంగాణ జనసేన పగ్గాలు అప్పజెప్పేందుకు పవన్ సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తున్నాయి.
ఇప్పటికే టార్గెట్ చంద్రబాబు అంటూ మోత్కుపల్లి తనదైన శైలిలో టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో పర్యటించి చంద్రబాబు మోసాలను ఎండగడుతానని ఇప్పటికే మోత్కుపల్లి ప్రకటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో భేటీ కావడంపై ఇటు రాజకీయ వర్గాల్లో అటు జనసేన కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. పవన్తో భేటీ ప్రాముఖ్యత గురించి మోత్కుపల్లి వన్ ఇండియా తెలుగుతో మాట్లాడారు. చంద్రబాబు వ్యతిరేక శక్తుల పునరేకీకరణలో భాగంగా జనసేనానిని కలుస్తున్నట్లు వివరించారు. పవన్ కళ్యాణ్తో సమావేశం అనంతరం భవిష్యత్తు కార్యాచరణ వివరిస్తారని తెలిపారు. కాగా తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మోత్కుపల్లి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశంలో పవన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన రాజకీయ ప్రస్థానం గురించి స్పందిస్తానని మోత్కుపల్లి వన్ ఇండియా తెలుగుకు తెలిపారు.