హత్యలో టీఆర్ఎస్ నేత వేముల వీరేశం, ప్రముఖుల పాత్ర: అమృత, కాదన్న పోలీసులు
Recommended Video
మిర్యాలగూడ: తన భర్త ప్రణయ్ హత్యలో నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పాత్ర ఉందని అమృత వర్షిణి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తమను బెదిరించారని, తన వద్దకు వచ్చి మాట్లాడాలని ఫోన్ చేశారని తెలిపారు. తన తండ్రికి వేముల వీరేశంతో మంచి సంబంధాలున్నాయన్నారు. ప్రణయ్ హత్యలో ఆయన పాత్ర కూడా ఉందని, దీనిపై విచారణ జరిపించాలన్నారు.
వేముల వీరేశం తమను బెదిరించాడని తన వద్దకు వచ్చి మాట్లాడాలని ఫోన్ చేశారన్నారు. తన భర్త మృతదేహాన్ని చూసి చలించిన అమృత ఆవేశంగా మాట్లాడారు. ప్రణయ్ హత్యలో వీరేశం పాత్ర ఉందంటూ రోదించారు. తన మామ బాలస్వామి ఎల్ఐసీలో ఉద్యోగిగా పని చేస్తుండగా అతనిపై కేతేపల్లి పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేయించారని ఆరోపించారు.
జైల్లో చచ్చిపో.. లేదంటే చంపేస్తారు: ప్రణయ్ తమ్ముడు, వదినను చూసి కన్నీరుమున్నీరు
వేముల వీరేశంపై ఆరోపణలు
తన మామను రెండు రోజుల పాటు కేతేపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉంచి నకిరేకల్ వెళ్లాల్సిందిగా సూచించారని అమృత తెలిపారు. దీంతో తాను ప్రణయ్ కలిసి హైదరాబాద్ రేంజీ ఐజీ స్టీఫెన్ రవీంద్రను కలిసి విషయం చెప్పానని, ఐజీ అప్పటి నల్గొండ ఎస్పీ శ్రీనివాస్ రావుకు ఫోన్ చేసి తమ విషయం పరిశీలించాలని, రక్షణ కల్పించాలని ఆదేశించారని గుర్తు చేసుకున్నారు. ఎస్పీ శ్రీనివాస్ రావు, డీఎస్పీ శ్రీనివాసులు జోక్యం చేసుకోవడంతో తప్పుడు కేసు తొలగించారన్నారు. అమృత ఆరోపణల నేపథ్యంలో ప్రజా సంఘాల నాయకులు ప్రణయ్ అంతిమయాత్రలో వీరేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.
తమను విడగొట్టేందుకు బెదిరించారు
తన తండ్రి మారుతిరావు, బాబాయి శ్రవణ్ కుమార్తో పాటు తాజా మాజీ ఎమ్మెల్యే, ఇతర ప్రముఖుల హస్తం ఉందని అమృత అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక తెరాస నేత, ఓ లాయర్, కాంగ్రెస్ లీడర్, పలువురు బిజినెస్మెన్స్ ఉన్నారని ఆరోపించారు. తమను విడగొట్టేందుకు పలువురు తమను బెదిరించారన్నారు.
వీరేశంకు సంబంధంలేదు
అమృత ఆరోపణలపై పోలీసులు స్పందించారు. ఈ హత్యకు నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వీరేశంలకు ఎలాంటి సంబంధం లేదని నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ వెల్లడించారని సమాచారం. ఈ హత్యకు వీరేశంతో పాటు నయీం గ్యాంగ్కు కూడా పాత్ర ఉన్నట్లుగా ఇప్పటి వరకు ఆధారాల్లేవని స్పష్టం చేశారు. హంతకముఠాకు సుఫారీ ఇచ్చి చంపించారని తెలిపారు.
అప్పుడు మారుతిరావు కన్నీరు పెట్టుకున్నాడు
ప్రణయ్, అమృత పెళ్లి సమయంలో వారితో మాట్లాడారని, తాను కూడా కులాంతర వివాహం చేసుకున్నానని, తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నించాలని మాత్రమే వీరేశం సూచించారని చెబుతున్నారు. గత మార్చిలో మారుతిరావును పిలిచి మందలించినట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు. అప్పుడు అతను కన్నీరు పెట్టుకున్నాడని, అయినా సందేహాలు ఉన్నాయని చెప్పారు. అనుమానాలు ఉన్నందునే ప్రణయ్కి చెప్పి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించామని తెలిపారు.