మక్కా పేలుళ్ళలో దోషులెవరు, కేంద్రం వైఫల్యం: సర్వే సత్యనారాయణ
హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ళ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులను నిర్ధోషులుగా సోమవారం నాడు ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక తీర్పుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ కేసులో సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో కేంద్రం వైఫల్యం చెందిందని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అన్ని మతాలను గౌరవించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మక్కా పేలుళ్ళ కేసులో కోర్టు తీర్పు అనంతరం సోమవారం నాడు హైద్రాబాద్లో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. భారత్ సెక్యులర్ దేశమన్నారు. అన్ని మతాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ కుటుంబం దేశాన్ని పాలించిన సమయంలో దేశం సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా లౌకిక వాదాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడిందన్నారు.
మక్కా పేలుళ్ళకు ఎవరు పాల్పడ్డారనే విషయమే తేలకుండా పోయిందన్నారు. ప్రాషిక్యూషన్ వైఫల్యం వెనుక ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు.ఈ పేలుళ్ళ సూత్రధారులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
Recommended Video
11 ఏళ్ళ క్రితం మక్కా మసీదు పేలుళ్ళ కేసు చోటు చేసుకొంది. ఈ కేసులో ఐదుగురిని ఎన్ఐఏ కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది. స్వామి ఆసిమానంద, భరత్, దేవేందర్ గుప్తా, రాజేందర్, లోకేష్ శర్మలను నిర్ధోషులుగా కోర్టు ప్రకటించింది. మిగిలినవారిపై ఛార్జీషీటు కొనసాగుతుందని ప్రకటించింది.