జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ భాగన్న కన్నుమూత...
జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ భాగన్న(86) కన్నుమూశారు. అనారోగ్యంతో 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం(ఫిబ్రవరి 26) సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత రెండేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయనకు ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జహీరాబాద్లో శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే చెంగల్ భాగన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసం జీవితం అంకితం చేసిన భాగన్న నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
జహీరాబాద్ మండలం గోపన్పల్లికి చెందిన బాగన్న వార్డు సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత సర్పంచి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు. 1994లో టీడీపీ తరుపున జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో బీజేపీ తరుపున జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.
అత్యంత నిరాడంబర జీవితం గడిపిన చెంగల్ భాగన్నకు ఇప్పటికీ సొంత ఇల్లు కూడా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అద్దె ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. భాగన్న సతీమణి మాణెమ్మ 15 ఏళ్ల క్రితం జహీరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.