‘రైతు దత్తత’కు ముందుకొచ్చిన ఫీనిక్స్: రూ. 5లక్షల విరాళం
హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ జాగృతి చేపట్టిన కార్యక్రమం ‘ఈచ్వన్-అడాప్ట్' వన్కు విశేష స్పందన లభిస్తోంది. రైతు కుటుంబాల్ని దత్తత తీసుకునేందుకు స్పందించాలంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపునకు స్పందించి అనేక మంది దాతలు ముందుకొస్తున్నారు.
తాజాగా ఫీనిక్స్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గోపీకృష్ణ స్పందించారు. డైరెక్టర్ చుక్కపల్లి అవినాశ్, ఎంఎస్ రావులతో కలిసి మంగళవారం జాగృతి అధ్యక్షురాలు కవితను ఆమె నివాసంలో కలిసి రూ.5 లక్షల చెక్కును అందించారు.
కాగా, ఎంపీ కవిత ఫీనిక్స్ ప్రతినిధులను అభినందించారు. ప్రముఖ వ్యక్తులు, సంస్థలు రైతు కుటుంబాలను ఆదుకునేందుకుగాను తమను సంప్రదిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఇప్పటికే పలువురు క్రీడా రంగ ప్రముఖులు, ఎన్నారైలు, వివిధ దేశాల జాగృతి విభాగాల సభ్యులు ఉదారంగా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.