నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్.. నిందితుల్లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు!
రాజేంద్రనగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాలలలో నకిలీ నోట్లు తయారుచేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు.
హైదరాబాద్: నగర శివారులోని రాజేంద్రనగర్ లో నకిలీ నోట్లు తయారుచేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు.
రాజేంద్రనగర్ హిమయత్ సాగర్ వద్ద గురువారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో లభించిన సమాచారం మేరకు లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాలలోని క్యాంటీన్ పై పోలీసులు మెరుపుదాడి చేశారు.
ఆ సమయంలో నకిలీ నోట్లు ముద్రిస్తున్న నలుగురిని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.32 లక్షల విలువైన రూ.2 వేల నోట్లతో పాటు జిరాక్స్ మిషన్, నాలుగు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కళాశాల ముగిసిన తరువాత వీరు కాలేజీలోని క్యాంటీన్ ను అడ్డాగా చేసుకుని నకిలీ నోట్ల తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఎస్ఓటీ పోలీసులు నలుగురు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.