ఒకేసారి నలుగురు కరోనా పేషెంట్స్ మృతి: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి ముందు ఆందోళన
తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. నేడు ఒకే రోజు నిజామాబాద్ జిల్లాలో నలుగురు కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాలు ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు సరిగా లేవని, డాక్టర్లు పట్టించుకోవడంలేదని, ఆక్సిజన్ సిలిండర్లు పెట్టకపోవడం వల్లే మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో కరోనా కారణంగా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.
నిజామాబాద్ జిల్లాలో కరోనాతో ఒకేసారి నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేగింది. ఒకరు ఆక్సిజన్ అందక మృతిచెందినట్లు ఆరోపణలు వస్తున్నాయి . వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఒక కరోనా బాధితుడు చనిపోయారని మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.
బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ వారి మృతికి కారణమైన వైద్య సిబ్బందిని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఒకేసారి నలుగురు చనిపోవడంతో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా పేషెంట్ ల బాగోగులను పట్టించుకోవడం లేదని, ఇక ఆసుపత్రి సిబ్బంది సైతం వైద్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
Recommended Video
తాజాగా ఆస్పత్రి వద్ద నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపధ్యంలో జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు. నలుగురు కరోనా బాధితులు ఒకేసారి ఎలా చనిపోయారన్న దానిపై ఆయన వైద్య శాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆసుపత్రిలో పరిస్థితిని, కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు.