రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి: క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టివేత
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా మక్తల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తాగిన మైకంలో లారీ డ్రైవర్ ఆటోను, ద్విచక్ర వాహనం, ఆటోను ఢీకొట్టాడు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్లి స్తంభాన్ని ఢీకొని లారీ బోల్లాపడింది.
లారీ కింద పడి అశ్విని, మహేష్, నర్మద, గీత అనే నలుగురు మృతిచెందారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. లారీ మైదా లోడుతో రాయ్ చూర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదిలావుంటే, హైదరాబాద్ నగర పోలీసులు ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్నేహపురి కాలనీలో ఉన్న శ్రీసాయి అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 304పై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు.
అజయ్రెడ్డి, భరత్రెడ్డి అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఆస్ట్రేలియా బిగ్ బాష్ ప్రీమియం లీగ్ కోసం బెట్టిగ్ ఏర్పాట్లు చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.2,11,980 నగదు, రెండు ల్యాప్ ట్యాప్లు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
నిందితులిద్దరిని చైతన్యపురి పోలీసులకు అప్పగించినట్టు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. మిర్యాలగూడకు చెందిన సంతోష్రెడ్డి, గుంటూరుకు చెందిన నర్సిరెడ్డి బెట్టింగ్ ప్రధాన నిర్వహకులుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. మరి కొందరు నిందితులు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు.