నారాయణపేటలో ఘోర రోడ్డు ప్రమాదం... కారు బోల్తా... నలుగురు అక్కడికక్కడే మృతి...
నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో ఓ కారు బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో మరొకరు గాయపడగా... ఓ చిన్నారి సురక్షితంగా బయటపడింది. బోల్తా కొట్టిన కారు హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మహిళలతో సహా ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది.
ఇటీవలి కాలంలో తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రెండు రోజుల క్రితం నిజామాబాద్లోని భీంగల్లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు బైక్ను ఢీకొట్టి హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ లారీ బైక్ను ఢీకొనడంతో మహిళ తీవ్రంగా గాయపడింది.