మంచిర్యాల జిల్లాలో విషాదం: అప్పుల బాధతో కుటంబం ఆత్మహత్య..
సోమగూడెం: మంచిర్యాల జిల్లా సోమగూడెం మండలం చొప్పరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది.
వివరాల్లోకి వెళ్తే.. చొప్పరిపల్లికి చెందిన కొండగొర్ల తిరుపతి(38), భూదేవి(32) దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామంలో కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు.
అయితే పంట నష్టం కారణంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డారు. పంట దిగుబడి తగ్గిపోవడంతో అప్పులు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది.
తొలుత తిరుపతి తన భార్యకు ఉరేసి.. ఆపై ఇద్దరు పిల్లలు కీర్తన(14), శశాంత్(13)లకు నిద్రమాత్రలు వేశాడు. భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందగా.. ప్రస్తుతం కీర్తన పరిస్థితి విషమంగా ఉంది. శశాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరికి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అప్పుల బాధతో గతంలోనూ తిరుపతి కుటుంబం ఓసారి ఆత్మహత్యకు యత్నించినట్టు స్థానికులు చెబుతున్నారు.