బోధన్ ఆర్డీవో ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకుని నలుగురు రైతుల ఆత్మహత్యాయత్నం
తెలంగాణ రాష్ట్రంలో ఇంకా తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆత్మహత్యా యత్నాలు నిత్య కృత్యంగా మారాయి. తహసీల్దార్ విజయ రెడ్డి సజీవ దహనం ఘటన జరిగి ఇంత కాలం అవుతున్నా ఆ ఘటన తర్వాత ఆత్మహత్యా యత్నాలు, అధికారులకు బెదిరింపులు ఆగటం లేదు . నేటికీ తహసీల్దార్ కార్యాలయాల వద్ద, ఆర్డీవో ఆఫీసుల వద్ద చోటు చేసుకుంటున్న ఘటనలు తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనని గుర్తు చేస్తూనే ఉంది . తాజాగా మరో ఆర్డీవో కార్యాలయంలో పెట్రోల్ బాటిల్ తో వెళ్ళిన రైతులు అక్కడ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి కలకలం సృష్టించారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని .. గద్వాల జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం
బోధన్ మండలంలోని పెంటకుర్దు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు బోధన్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఆత్మహత్య ప్రయత్నం చేశారు.తమ భూమికి సంబంధించిన సమస్యను అధికారులు పరిష్కరించటం లేదని వారు తమవెంట తెచ్చుకున్నపెట్రోల్ ను ఒంటిపై పోసుకున్నారు. ఆఫీసు వద్ద ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై పెట్రోలు బాటిళ్లను లాక్కుని వారిని అడ్డుకున్నారు.
ఇక బాధితులు చెప్తున్న వివరాల ప్రకారం గ్రామంలోని తమ వ్యవసాయ భూమిలోకి ప్రవేశించే దారిని మూసివేసి, పక్క భూమివారు ఒక గేటును నిర్మించారని సదరు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేదన్నారు. అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. వారి మనోవేదనను విన్న బోధన్ ఆర్డీఓ గోపిరామ్ న్యాయం జరిగేలా చూస్తామని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇక ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను ఆదేశించారు.