లగ్జరీ లైఫ్ కోసం..: వరంగల్లో ఇద్దరు టీవీ ఛానల్ స్ట్రింగర్స్ సహా 4గురి అరెస్ట్
పోలీసులమని చెప్పి ఇద్దరు బంగారం వ్యాపారుల నుంచి నగదు దోచుకున్న నలుగురు నిందితులను వరంగల్ పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టైన వారిలో ఇద్దరు టీవీ ఛానల్ స్ట్రింగర్స్ ఉన్నారు.
వరంగల్: పోలీసులమని చెప్పి ఇద్దరు బంగారం వ్యాపారుల నుంచి నగదు దోచుకున్న నలుగురు నిందితులను వరంగల్ పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టైన వారిలో ఇద్దరు టీవీ ఛానల్ స్ట్రింగర్స్ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వరంగల్ నగర పోలీసులు మీడియాకు వెల్లడించారు.
వరంగల్ నగర కమిషనర్ సుధీర్ బాబు ప్రెస్ నోట్ విడుదల చేశారు. పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
రెండు వేర్వేరు టీవీ చానళ్లకు పని చేస్తున్న ఎండీ రఫిక్ (27), శివ (29) అనే ఇద్దరు స్ట్రింగర్స్తో పాటు రవి (36), కిరణ్ (30)లను పోలీసులు అరెస్టు చేశారు. రవి బంగారం దుకాణంలో పని చేస్తున్నాడు. కిరణ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. వీరు నలుగురు కలిసి ఓ గ్రూప్గా తయారయ్యారు.
లగ్జరీ లైఫ్ కావాలనుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని పన్నాగం పన్నారు. ఈ నెల 21వ తేదీన విజయవాడకు చెందిన ఓ బంగారం వ్యాపారి వరంగల్ వచ్చారు. బంగారు ఆభరణాలను హన్మకొండలోని దుకాణంలో సరఫరా చేసేందుకు వచ్చారు.
రవి బంగారం దుకాణంలో పని చేస్తున్నాడు. దీంతో సదరు విజయవాడ బంగారు ఆబరణాల వ్యాపారి ఇతనికి తెలుసు. సదరు వ్యాపారి 21వ తేదీన హన్మకొండలో ఆభరణాలు ఇచ్చి, డబ్బులు తీసుకొని ఓ ఆటోలో వరంగల్ రైల్వే స్టేషన్ బయలుదేరారు. ఆయన విజయవాడకు వెళ్లాల్సి ఉంది.
సదరు వ్యాపారి డబ్బులతో వెళ్తున్న విషయం గుర్తించిన రవి తన గ్రూప్లోని రఫిక్, శివలకు సమాచారం అందించాడు. వారు ఆటోను వెంబడించి, వరంగల్ బస్టాండులో ఆపారు. వ్యాపారిని కిందకు దిగమన్నారు. తమను తాము పోలీసులుగా పరిచయం చేసుకున్నారు.
మీ బ్యాగులో ఏముందో చూడాలని వ్యాపారిని అడిగారు. అనంతరం అతనిని ఓ ద్విచక్ర వాహనం పైన ఎవరు లేని ప్రాంతానికి తీసుకు వెళ్లారు. అక్కడ అతని వద్ద ఉన్న డబ్బులను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే బాగుండదని హెచ్చరించి పంపించారు.
అదే రోజు, మరో వ్యాపారిని కూడా వీరు బెదిరించారు. ఆ వ్యాపారి బంగారంతో వరంగల్లో రైలు దిగాడు. అతను వరంగల్ నుంచి హన్మకొండకు ఆటో మాట్లాడుతున్నాడు. తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తన క్లయింట్లకు ఇచ్చేందుకు అతను వచ్చారు.
రవి అతనిని వరంగల్ రైల్వే స్టేషన్లో రాత్రి పది గంటలకు చూశాడు. మళ్లీ తన గ్రూప్లోని రఫిక్, కిరణ్లకు సమాచారం ఇచ్చాడు. వారు ఆటోను వెంబడించి, జెమిని థియేటర్ వద్ద ఆపారు. ఈ వ్యాపారి వద్ద కూడా పోలీసులుగా పరిచయం చేసుకున్నారు.
అనంతరం అతనిని ఎవరు లేని చోటుకు తీసుకు వెళ్లారు. బ్యాగును చెక్ చేయాలన్నారు. అతని నుంచి బంగారు ఆభరణాలు తీసుకున్నారు. ఎవరికి చెప్పవద్దని, చెబితే బాగుండదని హెచ్చరించారు. ఇద్దరు వ్యాపారులు కూడా మట్వాడా, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
పోలీసులు దీనిని తీవ్రంగా పరిగణించారు. పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు దృష్టికి వచ్చింది. ఏసీబీ ఈశ్వర రావుకు కేసును అప్పగించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం పోలీసులు హంటర్ రోడ్డులోని సంతోషి మాతా ఆలయం వద్ద వాహనాలు చెక్ చేశారు. నిందితులను గుర్తించి, అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.