ఎవరా నలుగురు?: నిందితులకు రాచమర్యాదలా!, అసలు అక్కడికి ఎందుకెళ్లారు..
మెదక్: మెదక్ జిల్లా అభయారణ్యంలో అర్థరాత్రివేళ నలుగురు పట్టుబడ్డారు. అంత రాత్రివేళ సెర్చ్ లైట్లతో వాళ్లు అక్కడేం చేస్తున్నారన్నది ఎవరికీ తెలియదు. పోనీ పట్టుకున్న పోలీసులైనా చెప్పారా? అంటే అదీ లేదు. పైగా వారికి బిర్యానీ పెట్టించి.. విశ్రాంతి తీసుకోమని ఏసీ గదులు కూడా ఇచ్చారు. బడా కుటుంబాలకు చెందిన వ్యక్తులు కాబట్టే.. పోలీసులు ఇంత రాచమర్యాదలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నలుగురు?..
నలుగురు పట్టుబడ్డారు
మంగళవారం అర్థరాత్రి మెదక్ జిల్లా సరిహద్దుల్లోని పోచారం అభయారణ్యంలో నలుగురు వ్యక్తులు చొరబడ్డారు. సెర్చ్ లైట్లతో దేనికోసమో వారు గాలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పట్టుకున్నారు. అయితే వారి వద్ద ఎటువంటి మారణాయుధాలు దొరకలేదని అధికారులు చెప్పారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్నందుకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు.
రాత్రి 10గం.కు..:
అయితే అరెస్ట్ తర్వాత ఉదయం 6గం. ఆ నలుగురు వ్యక్తులను మెదక్ తీసుకొచ్చిన పోలీసులు.. రాత్రి వరకు కేసు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాత్రి 10గం. సమయంలో మెజిస్ట్రేట్ ముందు వారిని హాజరపరిచారు. అనంతరం రిమాండుకు తరలించారు. అయితే రిమాండుకు తరలించేముందు వారికి రాచమర్యాదలు బాగానే చేశారు.
రాచమర్యాదలు:
రిమాండుకు తరలించే ముందు మెదక్లోని ఓ రెస్టారెంట్కు తీసుకెళ్లి వారికి బిర్యానీ తినిపించారు. హోటల్ సీసీటీవి కెమెరాల్లో ఈ ఈ దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. పైగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వారిని అటవీ శాఖ గెస్ట్ హౌజ్ లోని ఏసీ గదుల్లో ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. అసలు అభయారణ్యంలోకి వారు ఎందుకొచ్చారు? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.
ఒత్తిళ్లకు తలొగ్గారా?:
ఆ నలుగురు బడా కుటుంబాలకు చెందినవారై ఉంటారని, ఒత్తిళ్ల వల్లే వారి పేర్లు పోలీసులు వెల్లడించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం భారీగానే డబ్బు కూడా ముట్టిందన్న ఆరోపణలు తెర పైకి వస్తున్నాయి. దీంతో ఈ కేసు విచారణపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నిందితులెవరు?.. ఎక్కడివారు?.. ఎందుకు అభయారణ్యంలోకి వచ్చారన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.