ఒకే ఊరు.. ఒకే చోట పని.. అనుమానస్పదంగా నలుగురి దుర్మరణం
మేడ్చల్ : ఆ నలుగురు స్నేహితులు. కలిసి పెరిగారు. కలిసి పనిచేద్దామనుకున్నారు. కానీ విధి చిన్నచూపు చూసింది. నలుగురు ప్రాణాలు ఒకేసారి బలిగొంది. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఘటన విషాదం నింపింది. నలుగురు యువకులు అనుమానస్పద స్థితిలో దుర్మరణం చెందడం కలకలం రేపింది. వీరంతా కూడా 20 నుంచి 25 ఏళ్ల లోపే ఉండటం గమనార్హం.
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మహేశ్, సతీశ్, మహేందర్, అరవింద్ స్నేహితులు. ఒకే చోట పనిచేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలం బొమ్మరాసిపేటలోని ఓ కోళ్లఫామ్ లో పనికి కుదిరారు. అయితే శుక్రవారం తెల్లవారేసరికి విగతజీవులుగా కనిపించారు.
నెల కిందటే వీరు అక్కడ పనిలో చేరినట్లు తెలుస్తోంది. కోళ్లఫామ్ పక్కనే వీరు ఉండటానికి గది ఇచ్చారు యజమాని. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు పనిచేసినట్లు సమాచారం. కోళ్లకు స్టెరాయిడ్స్ ఇచ్చే పనిలో లేట్ నైట్ వరకు పనిచేసి.. భోజనం తిని పడుకున్నట్లుగా యజమాని చెబుతున్నారు. అయితే తెల్లారేసరికి వీరు చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.