డిసెంబర్ 31 రాత్రి... అక్కాచెల్లెళ్లపై నలుగురు యువకుల గ్యాంగ్ రేప్... తల్లిని బెదిరించి...
నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. పీకలదాకా మద్యం సేవించిన నలుగురు యువకులు మైనర్ బాలికలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు నిరుపేద కుటుంబానికి చెందినవారు కావడం... అత్యాచార సమయంలో వీడియోలు తీసిన నిందితులు బ్లాక్మెయిల్ చేస్తుండటంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు సాహసించట్లేదని తెలుస్తోంది.పైగా ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా గ్రామ పెద్దల సమక్షంలో బాధితులకు పరిహారం ఇప్పించేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 31 రాత్రి...
స్థానికుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లాలోని లింగాల మండలానికి చెందిన నలుగురు యువకులు డిసెంబర్ 31 రాత్రి పీకలదాకా మద్యం సేవించారు. అనంతరం అదే గ్రామంలోని ఓ మహిళ ఇంటికి వెళ్లారు. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె జీవనం సాగిస్తోంది. ఆ రాత్రి ఆ వితంతువు ఇంటికెళ్లిన నలుగురు యువకులు ఆమెను బెదిరించి ఇంట్లోకి చొరబడ్డారు. అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
అత్యాచారం.. సెల్ఫోన్లో వీడియో షూట్...
అనంతరం 16,14 ఏళ్ల వయసున్న ఆమె ఇద్దరు కుమార్తెలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు,ఈ తతంగాన్ని తమ సెల్ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కితే వీడియోలు లీక్ చేస్తామని,చంపేస్తామని బెదిరించారు. నిరుపేద కుటుంబం,వెనకా ముందు ఎవరూ లేకపోవడంతో బాధితులు తమపై జరిగిన అత్యాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సాహసించలేదు. ఫిర్యాదు చేస్తే నిందితులు ఎక్కడ మళ్లీ తమపై దాడి చేస్తారేమోనని భయపడి ఎవరితోనూ ఆ విషయాన్ని చెప్పలేదు.
పంచాయితీ పెట్టిన గ్రామ పెద్దలు...
అత్యాచార విషయం ఎలా బయటకు పొక్కిందో తెలియదు గానీ ఇటీవల ఆ గ్రామానికి చెందిన పెద్దలు పంచాయితీ పెట్టి నిందితుల నుంచి బాధితులకు పరిహారం ఇప్పించేలా ఒప్పందం కుదిర్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు బాధితులు ఒప్పుకున్నారా.. లేదా అన్నది క్లారిటీ లేదు. అత్యాచార ఘటనపై ఇప్పటికైతే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు. ఇద్దరు నిరుపేద అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడిన ఆ నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఈ విషయం తెలిసిన పలువురు డిమాండ్ చేస్తున్నారు.