ఆరింటిలో ఒకటి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై
హైదరాబాద్: రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై ఇంటర్నెట్ సౌకర్యానికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా దేశంలోని ఆరు రైల్వే స్టేషన్ల పరిధిలో ఈ సౌకర్యాన్ని కల్పించేందుకు ఎంపిక చేసింది. ఈ ఆరింటిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు రైల్వే మంత్రిత్వ శాఖ చోటు కల్పించింది.
దశల వారీగా ఈ సౌకర్యాన్ని విస్తరించనున్నారు. సికింద్రాబాదుతో పాటు ముంబై, ఆగ్రా, వారణాసి, అహ్మదాబాద్, హౌరా స్టేషన్లలో దీనిని ప్రస్తుతం ప్రవేశ పెట్టారు. సెల్ఫోన్కి ఆయా స్టేషన్లలో ఈ సౌకర్యం అరగంట పాటు అందుబాటులో ఉంటుంది. ఈ వ్యవధి తర్వాత వైఫై నెట్ వర్క్ ఆగిపోతుంది. దీనిని సికింద్రాబాదులో ప్రయోగాత్మకంగా అమలు చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సుమారు పది స్టేషన్ల పరిధిలో వైఫైని అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు. ఏపీలో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖ, తెలంగాణలో కాచిగూడ, నాంపల్లి, వరంగల్, కరీంనగర్, కాజీపేటలు పరిశీలనలో ఉన్నాయి.