'మద్యం తాగి ఉన్నాడో లేదో తెలియదు, డిన్నర్కు పిలిచా అంతలోనే'
నిన్న రాత్రి తొమ్మిదింపావుకు తాను రవితేజ సోదరుడు భరత్ రాజుతో మాట్లాడానని, ఆపై తెల్లారి ఆయన మరణవార్తను మీడియాలో చూసి ఆవేదన చెందానని అడ్వోకేట్ ఆదిత్య వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: నిన్న రాత్రి తొమ్మిదింపావుకు తాను రవితేజ సోదరుడు భరత్ రాజుతో మాట్లాడానని, ఆపై తెల్లారి ఆయన మరణవార్తను మీడియాలో చూసి ఆవేదన చెందానని అడ్వోకేట్ ఆదిత్య వ్యాఖ్యానించారు. ఆదివారం ఉస్మానియా ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు.
నాలుగేళ్ల నుంచి భరత్తో తనకు పరిచయం ఉందని, ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవాళ్లమని చెప్పారు. ఇటీవల తనకు వివాహమైందని, అందువల్ల గత కొంతకాలంగా తామిద్దరమూ కలవలేకపోయామని చెప్పారు.
డిన్నర్కు పిలిచా.
రాత్రి మాట్లాడానని, చాలా రోజులు అవుతుంది కాబట్టి కలసి డిన్నర్ చేసేందుకు పిలిచానని, తర్వాత మాట్లాడతానని చెప్పి భరత్ ఫోన్ పెట్టేశారని ఆదిత్య చెప్పారు.
తాగి ఉన్నాడో లేడో తెలియదు
ఆ సమయంలో ఆయన మద్యం తాగి ఉన్నారా? అన్న విషయమై తనకు తెలియదని అడ్వోకేట్ చెప్పారు. తనకు భరత్తో తప్ప వారి కుటుంబీకులెవరితోనూ పరిచయాలు లేవన్నారు. రాత్రి తాను మాట్లాడిన స్నేహితుడు తెల్లారేసరికి దూరమవుతాడని ఊహించలేదన్నారు.
మహా ప్రస్థానానికి తరలింపు
ఔటర్ రింగ్రోడ్పై జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భరత్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఆసుపత్రి వైద్యుడు దేవరాజ్ శవపరీక్ష నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అంతిమ సంస్కార నిమిత్తం భరత్ మృతదేహాన్ని జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానానికి తరలించారు.
లారీ కిందకు దూసుకెళ్లడంతో..
కాగా, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ సమీపంలో ఔటర్ రింగు రోడ్డు ప్రమాదంలో నటుడు రవితేజ సోదరుడు భరత్ మృతి చెందిన విషయం తెలిసిందే. రహదారిపై ఆగి వున్న లారీని భరత్ ప్రయాణిస్తున్న స్కోడా కారు(టీఎస్09 ఈసీ 0799) వేగంగా ఢీకొంది. కారు సగభాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో భరత్ అక్కడికక్కడే మృతిచెందారు.
పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు
అర్థరాత్రి గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్ సిబ్బంది ఈ ఘటనను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆర్జీఐఏ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కారులో నుంచి బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.