ఢీల్లీలో దోస్తీ...! గల్లీలో కుస్తీ..! అదే గులాబీ యుక్తి.. !!
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మరో సారి తన రాజకీయ వ్యూహా చతురతను కనపర్చారు.తాను పరోక్షంగా బీజేపీ మిత్రుడిననే అభిప్రాయాన్ని కల్గించారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ను దెబ్బతీయడం కోసం మిత్రుడు కాని మిత్రుడితో జతకట్టారు.తటస్థ రాజకీయాల వల్ల ప్రయోజనం లేదనుకున్నారో ఏమో ఆయన కాషాయ పంచన చేశారు. దేశ్ కీ నేతగా ఆవిర్భవించాలని ఉవ్విళ్లూరిన చంద్రశేఖర్ రావు ప్రత్యామ్నాయాన్ని పక్కన పెట్టి బీజేపీకి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎన్డీఎతో చెట్టాపట్టాలేసుకుంటున్నారు.
కేంద్రలో సానుకూలం..! ప్రాంతీయంగా మాత్రం ప్రతికూలం..!!
చంద్రశేఖర్ రావు ఈ రాజకీయ వ్యూహాల కారణంగా ఆయనకు వచ్చే నష్టమేమీ పెద్దగా లేదనే చెప్పాలి. కాని తెలంగాణ బీజేపీకి మాత్రం చావు దెబ్బే.రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించడానికి లక్ష్మణ్ నాయకత్వంతో బీజేపీ నాయకులు బస్సు వేసుకొని అన్ని నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు. బహిరంగ సభలు నిర్వహించిన చెమటలు కక్కేలా కేసీఆర్ పైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు.టీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మీద కాషాయ నాథులు కన్నెర్ర చేస్తు ఆరోపణల కల్లోల్లం స్రుష్టిస్తున్నారు. కాని మోదీ,అమిత్ షా మాత్రం కేసీఆర్ ను కౌగిలించుకుంటున్నారు. చంద్రశేఖర్ రావు కూడా వారి ప్రేమను దఫ దఫాలుగా ఆమోదిస్తు వస్తున్నారు.
ఢిల్లీ లో కలుస్తాం...! తెలంగాణలో వ్యతిరేకిస్తాం..!!
రాష్ట్రపతి ఎన్నిక నుంచి టీఆర్ఎస్,బీజేపీ మధ్య సాన్నిహిత్యం క్రమ క్రమగా పెరుగుతూపోతోంది.తాజాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికతో వీరిద్దరి మధ్య ప్రేమ మరింతగా పెరిగింది.నిజానికి పార్లమెంటులో ఇటీవల జరిగిన పరిణామాలతో టీఆర్ఎస్ బీజేపీతో దూరంగా ఉంటుందని అంతా భావించారు. అవిశ్వాస సందర్భంగా విభజన హమీలపైన తెలంగాణ రాష్ట్ర సమితి ఎం.పిలు కేంద్ర ప్రభుత్వ తీరుపైన విరుచుకుపడ్డారు. తమపైన సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. ఓటింగ్ సమయంలో ఎన్డీఎకు మద్దతునివ్వకుండా టీఆర్ఎస్ దూరంగా ఉంది. అయితే డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక నాటికి కేసీఆర్ మళ్ళీ బీజేపీ కు అనుకూలంగా ఓటువేశారు.ముస్లిం రిజర్వేషన్లతో పాటు అనేక అంశాలపైన కేంద్రం తీరును చంద్రశేఖర్ రావు తప్పు పడుతున్నారు. అంశాల వారీగా మాత్రమే తాము మోదీకి మద్దతునిస్తుందువల్ల తెలంగాణ ముస్లింలు దూరమయ్యే ఛాన్స్ లేదని చంద్రశేఖర్ రావు బలంగా నమ్ముతున్నారు. దీనికి తోడు షాదీముబారాక్, రంజాన్ విందుతో పాటు మైనార్టీ గురుకులాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ఇప్పటికే టీఆర్ఎస్ కు మైనార్టీలు దగ్గరయ్యారని ఆయన విశ్వసిస్తున్నారు.
థర్డ్ ఫ్రంటూ లేదూ.. గుణాత్మక మార్పూ లేదు.. అంతా తూచ్..!!
ఇదే సమయంలో రాష్ట్రంలో తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బలపడకుండా ఉండాలంటే బీజేపీని పెంచిపోషించడమే మేలన్న సిద్దాంతానికి కేసీఆర్ వచ్చారు.మరో వైపు తాను తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ రూపుదిద్దుకోవడం అసాధ్యమన్న సంగతి కూడా చంద్రశేఖర్ రావుకు అర్థమైనట్లు కనిపిస్తోంది. విభిన్న ధ్రువాలున్న పార్టీలను ఒకతాటిపైకి తీసుకురావడం అంత సులువు కాదని ఇప్పటికే తేలిపోయింది. ఆయన నాలుగు పర్యటనల్లో ఒక్కటి కూడా సంపూర్ణ విజయాన్ని అందించలేదు. దీనికి తోడు కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరించే వాతావరణం కనిపించడం లేదు. అందుకే చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ కంటే మోదీ టెంటే బెటర్ అన్న అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది.
అటు కమలంతో ఇటు మజ్లిస్ తో ప్రయాణం..! కేసీఆర్ కే సాద్యం..!
ఒక వైపు మోదీకి అంశాలవారీగా మద్దతునిస్తు మరో వైపు ప్రత్యామ్నాయ వేదిక అంటున్న చంద్రశేఖర్ రావు ఈ విషయంలో విశ్వసనీయత కోల్పోయినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఒక వేళ ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును కొనసాగిస్తే అది కచ్చితంగా బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమనే అభిప్రాయం బలంగా వినిపించే అవకాశముంది. ఈ పరిణామాలన్ని చూస్తే జాతీయస్థాయి నేతగా ఎదగాలని తాపత్రయపడిన చంద్రశేఖర్ రావు ఇప్పుడు స్వయంగా తనను తాను కుదించుకుంటున్నారని అర్థమౌతోంది. మరో వైపు తాజా పరిణామాలపైన రాష్ట్రంలోని కేసీఆర్ మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మోదీని బలోపేతం చేస్తున్న చంద్రశేఖర్ రావు చర్యలను ఖండిస్తారో లేక మిత్రుత్వాన్ని కొనసాగిస్తారో ఓవైసీ సోదరులు చెప్పాలి.