గోల్డ్ మెడల్ గెలిచిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ కూతురు: హత్యతో గుత్తికోయల గ్రామ బహిష్కరణ
ఖమ్మం: గుత్తికోయల చేతిలో హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(ఎప్ఆర్ఓ) శ్రీనివాసరావు కుమార్తె విషాదంలోనూ విజేతగా నిలిచి అందరి మన్ననలను అందుకుంటోంది. తండ్రి అమరుడైన నాలుగో రోజునే పుట్టెడు దు:ఖాన్ని దాచుకున్న ఆయన కుమార్తె క్రీడా పోటీల్లో పాల్గొంది.
రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు కుమార్తె కృతిక.. తండ్రికి తనయగా ప్రశంసలందుకుంది. ఆమె ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది. తండ్రి ప్రోత్సహాంతో అథ్లెటిక్స్లో రానిస్తున్న కుమార్తె కృతిక.. కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన ఉమ్మడి ఖమ్మం సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్లో పాల్గొంది.
అండర్ 10 విభాగంలో లాంగ్జంప్లో స్వర్ణం, 100 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకుంది కృతిక. డిసెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. నిర్వాహకులు, కోచ్లు ఆమె ధైర్యాన్ని, ప్రతిభను మెచ్చుకున్నారు. కాగా, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన ఎఫ్ఆర్ఓ సీహచ్ శ్రీనివాసరావు నవంబర్ 22న గుత్తికోయల దాడిలో అమరుడయ్యారు.
గుత్తికోయల గ్రామ బహిష్కరణ
తన విధులు నిర్వహిస్తున్న ఎప్ఆర్ఓ శ్రీనివాసరావును కొందరు గుత్తికోయలు దాడి చేసి హత్య చేసిన ఘటనపై భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని బెండలపాడు పంచాయతీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యను ఖండిస్తూ తీర్మానం చేసింది పంచాయతీ పాలకవర్గం.
అంతేగాక, గ్రామం నుంచి గుత్తికోయలను బహిష్కరించాలని బెండలపాడు పంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. నిందితులు నివసించే ఎర్రబోడు నుంచి ఛత్తీస్గఢ్కు వారిని తరలించాలని గ్రామసభ నిర్ణయించింది.
శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామన్న సీఎం
శ్రీనివాసరావు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ప్రకటించారు. డ్యూటీలో ఉన్నప్పుడు శ్రీనివాసరావుకు అందే జీతభత్యాలన్నీ పదవీ విరమణ వయస్సు వచ్చేదాకా ఆయన కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబసభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.