చిరు నుంచి మోహన్బాబు వరకు: ఎన్టీఆర్ తర్వాత.. బాబుకు 'కేసీఆర్' షాక్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఏపీ నేతల నుంచి, సినిమా ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. చిరంజీవి నుంచి మోహన్ బాబు వరకు పలువురు తెలంగాణ సీఎం పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.
కేసీఆర్ సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వంటి సినీ ప్రముఖులు సహా పలువురు కితాబిచ్చారు. గత గోదావరి పుష్కరాల సమయంలో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కితాబిచ్చారు.
మాజీ మంత్రి, టిడిపి నేత టీజీ వెంకటేష్ కొద్ది రోజుల క్రితం కరీంనగర్ వచ్చారు. ఆ సమయంలో ఆయన కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే ఎలా ఉంటుందోనని భయపడ్డామని, కానీ ఎలాంటి శాంతిభద్రతల సమస్య లేదని కితాబిచ్చారు. తాజాగా, మోహన్ బాబు కూడా ప్రశంసించారు.
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. రాజకీయాలకు అతీతంగా మంచి పనులు చేయడంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు తర్వాత ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమైనవారని చెప్పారు. ఎన్టీఆర్ తర్వాత ప్రజల్లో అంత మంచి పేరు కేసీఆర్కు వచ్చిందన్నారు.
ప్రశంసలు
పలువురు ఏపీ రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు తెలంగాణ సీఎం కేసీఆర్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న ఏపీ టిడిపి నేతలు, ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా మెచ్చుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఓ విధంగా విపక్ష నేతల నుంచి కేసీఆర్పై ప్రశంసలు కురుస్తుండగా, చంద్రబాబుకు మాత్రం ఆ మేర మద్దతు లభించడం లేదనే అంశం చర్చనీయాంశమైంది.
చిరంజీవి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సినిమా పరిశ్రమ అభివృధ్దికి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ చిరంజీవి కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను ఇరుకున పెట్టాయని చెప్పవచ్చు.
లగడపాటి రాజగోపాల్
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ప్రస్తుత టిడిపి ఎంపీ టీజీ వెంకటేష్ (విభజనకు ముందు కాంగ్రెస్ నేత, మంత్రి)లు కేసీఆర్ పైన ప్రశంసలు కురిపించడం గమనార్హం.
రోశయ్య
ఇటీవల కరీంనగర్ జిల్లాకు వచ్చిన తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం పైన ప్రశంసలు కురిపించారు. ఏపీ నేతలు, సినీ ప్రముఖులే కాదు.. ఏపీలో కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు కూడా పెట్టిన విషయం తెలిసిందే. అమరావతి శంకుస్థాపనకు వెళ్లిన కేసీఆర్కు, ఇటీవల బర్త్ డే జరుపుకున్న కేటీఆర్కు ఏపీలో ఫ్లెక్సీలు వెలిశాయి.