పళ్ల రసాలు, షోడాలు ఎంతో ప్రమాదం..! నిఘా లేక రెచ్చి పోతున్న వ్యాపారులు..!!
హైదరాబాద్ : నగరంలో ఎండలు మండిపోతున్నాయి. వివిద పనులకోసం రోడ్డెక్కుతున్న జనాల గొంతు ఎండ తీవ్రతకు తడారిపోతుంటుంది. రోడ్డు పక్కన ఉన్న తోపుడుబండ్ల మీద షోడా, పళ్ల రసాలు, మజ్జిగ లాంటి శీతల పానీయాలు తాగుదామంటే ఉలిక్కిపడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. దాహం తీర్చుకుందామంటే ఝడుసుకునే పరిస్థితులు తలెత్తాయి. అన్నిటిలో వాడే నీళ్లను ఎక్కడ నుంచి తెస్తున్నారు, అది త్రాగునీరేనా..ఏదన్నా కల్తీ కలిసిన నీళ్లా అనే సందేహంతో ప్రజలు తొందరపడి దాహార్తిని తీర్చుకోవడం లేదు. కేవలం మినరల్ బాటిళ్లు తప్ప తోపుడు బండ్ల మీద దొరికే పానీయాలను తీసుకునేందుకు జంకుతున్నారు పగర ప్రజలు.
రోడ్ల పక్కన పళ్ల రసాలు, సోడాలతో ముప్పు..!
దాహార్తిని తీర్చుకునేందుకు రోడ్ల పక్కన పళ్ల రసాలు తాగకండి. 81 శాతం పళ్ల రసాలు అసలు తాగేందుకు పనికిరావని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ముంబైవాసులను హెచ్చరించింది. అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ 968 నమూనాలు సేకరించి పరీక్షించగా.. అందులో 786 నమూనాలు తాగేందుకు అనువుగా లేవని సంస్థ నిర్వహించిన పరీక్షల్లో తేల్చింది. పళ్లరసాల తయారీలో వినియోగించే నీరు/ఐస్ అత్యంత కలుషితంగా ఉందని పేర్కొంది.
ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఘటన..!
నగరంలోని తెలుగుతల్లి వంతెన పక్కన తోపుడు బండిపై సోడా అమ్మే వ్యక్తి ఫ్లై ఓవర్ కింద చెట్లకు పడుతున్న నీటిని డబ్బాలో తీసుకెళ్లిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్గా మారింది. సాధారణంగా హుస్సేన్సాగర్ నీటిని చెట్లకు పోస్తారు. అదే నీటిని సోడా బండి వ్యక్తి డబ్బాలో తీసుకెళ్లడాన్ని చూసిన నగరవాసులు బయ ట విక్రయించే డ్రింక్స్ ఎంత వరకు సురక్షితం అనే ఆలోచనలో ఉన్నారు. ఆరుబయట పానీయాలతో అనారోగ్య ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రైల్వే స్టేషన్లలో పళ్లరసాల విక్రయంపై మార్చిలోనే రైల్వే శాఖ నిషేధం విధించింది.
జీహెచ్ఎంసీకి పట్టదా..? ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న వైనం..!!
ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని జీహెచ్ఎంసీ, వైద్య, ఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదు. రోడ్లపక్కన పళ్లరసాలు, సోడాలు, ఇతరత్రా ఆహార పదార్థాలు విక్రయించే తోపుడుబండ్లను అధికారులు పరిశీలించడం లేదు. కల్తీ సామగ్రి వాడుతున్నారని తెలిసినా తనిఖీలు నిర్వహించడం లేదు. గ్రేటర్లో కేవలం ముగ్గురు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్న నేపథ్యంలో నగరంలోని తోపుడు బండ్ల వద్ద నమూనాలు సేకరించడం సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంత వరకు సురక్షితం..! తనఖీలు లేకపోవడంతో రెచ్చిపోతున్న వ్యాపారులు..!!
వేసవి నేపథ్యంలో ప్రధాన రహదారులతో పాటు కాలనీలు, బస్తీల్లో సోడా, పళ్లరసాలు, పుచ్చకాయ విక్రయించే బండ్లు కనిపిస్తున్నాయి. పళ్లరసాల్లో నీటితో పాటు ఐస్ వేస్తుంటారు. ఐస్ను నాణ్యమైన నీటితో తయారు చేయడం లేదని పలు పరిశీలనల్లో తేలింది. ఇలాంటి వాటిని తినడం వల్ల వాంతులు, విరేచనాలు, జాండిస్, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.