కొలిక్కి వచ్చిన డ్రగ్ కేసు: ఎఫ్ఎస్ఎల్ ఆ 'ఒక్క' నటుడికి షాక్, అందుకే ఆలస్యం
హైదరాబాద్: సంచలనం రేపిన డ్రగ్ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక న్యాయస్థానానికి చేరింది. అది త్వరలో సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు) బృందం చేతికి రానుంది. డ్రగ్ కేసులో ఆరు నెలల క్రితం నటులు తరుణ్, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, దర్శకులు పూరీ జగన్నాథ్ సహా 12 మందిని విచారించిన విషయం తెలిసిందే.
ఆ 'నలుగురి'పై ప్రశ్నలతో రవితేజ ఉక్కిరిబిక్కిరి, 'కిక్' ఎఫెక్ట్: శాంపిల్స్కు నో
Recommended Video
తరుణ్, సుబ్బరాజు, పూరీలతో పాటు మరో ఇద్దరు శాంపిల్స్ తీసుకున్నారు. మొత్తం ఐదుగురివి తీసుకున్నారు. కొందరివి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఐదు కేసుల్లో నివేదికను ఫోరెన్సిక్ కోర్టుకు పంపించింది. ఇది సిట్ చేతికి రానుంది.
ఒకరి నమూనాలో డ్రగ్స్
ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోర్టుకు వచ్చిన నేపథ్యంలో డ్రగ్ కేసు వ్యవహారం కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఛార్జీషీటు దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. సమాచారం మేరకు సినీ పరిశ్రమకు చెందిన ఒకరిలో డ్రగ్స్ నమూనాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
అందుకే ఆలస్యం
సాంకేతికంగా ఎవరూ తప్పుపట్టకుండా నమూనాలను రెండోసారి కూడా విశ్లేషణకు పంపడం వల్ల మొత్తం ప్రక్రియ ఆలస్యమైందని అంటున్నారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత సిట్ అధికారులు ఛార్జీషీట్ దాఖలు చేయనున్నారు.
నమూనాలు ఇచ్చిన ముగ్గురు
డ్రగ్ సరఫరాదారు కెల్విన్ ద్వారా సమాచారం సేకరించి 12 మంది సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. విచారణకు హాజరైన వారిలో ముగ్గురు గోళ్లు, రక్తం, వెంట్రుకల నమూనాలివ్వగా మరో ముగ్గురు తిరస్కరించారు. సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి మిగతా దర్యాప్తు అంతా పూర్తి చేశారు.
కోర్టు ప్రశ్నించొచ్చు
సేకరించిన నమూనాలను తెలంగాణ ఎఫ్ఎస్ఎల్ నివేదికకు పంపించారు. ఈ తరహా పరీక్షలేవీ గతంలో ఇక్కడ చేసి ఉండకపోవడం వల్ల కూడా ఆలస్యమైందని అంటున్నారు. ఢిల్లీ నుంచి అవసరమైన పరికరాలు తెప్పించి విశ్లేషించారు. న్యాయ విచారణలో భాగంగా ఈ విశ్లేషణ విధానాన్ని కోర్టు ప్రశ్నించే అవకాశముంది.
సిట్ చేతికి రానుంది
ఈ కారణంతో తెలంగాణ వైజ్ఞానిక పరిశోధనాశాల విశ్లేషించిన ఈ నమూనాలను మరోమారు ఐఐసీటీలో పునఃపరీక్షించారని తెలుస్తోంది. నివేదికలను కోర్టుకు సమర్పించారు. దర్యాప్తు అధికారులు ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆ నివేదికను తీసుకోనున్నారు. దీనిని చూసిన తర్వాత ఛార్జీషీట్లో జోడిస్తారు.