బీరు బాటిల్లో ఫంగస్: కింగ్ ఫిషర్పై కోర్టుకెళ్తామని యువకులు
మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలోని ఓ దుకాణంలో కొందరు యువకులు బీరు కొన్నారు. అందులోని ఓ బీరు సీసాలో ఫంగస్ వచ్చింది. దీంతో అవాక్కయిన ఆ యువకులు దీనిపై న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారట.
హైదరాబాదుకు చెందిన కొందరు యువకులు జిల్లాలోని కల్వకుర్తిలో గల ఓ వైన్ షాప్లో బీరు సీసాలు కొన్నారు. అందులో ఓ సీసాలో ఫంగస్ కనిపించింది. పురుగులు కూడా కనిపించాయి. దీంతో సదరు బీరు సీసా కంపెనీ పైన కోర్టుకు వెళ్తామని చెబుతున్నారు. ఆ బీరు సీసాలు కింగ్ ఫిషర్ కంపెనీకి చెందినవిగా తెలుస్తోంది.
బిటెక్ విద్యార్థి మృతి
వేగంగా వస్తున్న డిసిఎం ఓ బైకును ఢీకొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్న సందీప్ తన స్నేహితుడు సాయితో కలిసి బైక్ పైన వస్తున్నాడు.
ఆ సమయంలో ఎదురుగా వచ్చిన డీసీఎం వీరి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న సందీప్ అక్కడిక అక్కడే మృతి చెందాడు. సాయికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.