చిచ్చా.. జర పాన్ మానెయ్యరాదే!:కేటీఆర్ మాస్ డైలాగ్.. ఎవరితో?
పద్మారావును చిచ్చా అని చనువుగా సంబోధించే కేటీఆర్.. ఆయనెప్పుడు ఎదురపడ్డ 'చిచ్చా.. జర పాన్ మానేయ్యే..' అంటూ సలహా ఇస్తారట.
హైదరాబాద్: ఎంత సీరియస్ రాజకీయాల్లో అయినా సరే.. అప్పుడప్పుడు నేతల మధ్య సరదా సంభాషణలు చోటు చేసుకోవడం సర్వ సాధారణం. ఇక కాస్త సన్నిహితంగా మెలిగే నేతల మధ్య అయితే.. సందర్బాన్ని బట్టి జోకులు పేలుతూనే ఉంటాయి.
టీఆర్ఎస్ లో క్లాస్ ను మాస్ ను మిక్స్ చేసినట్టుండే మంత్రి కేటీఆర్.. పక్కా మాస్ అన్నట్టుగా ఉండే మంత్రి పద్మారావుల మధ్య కూడా ఇలాంటి సరదా సందర్బాలు అనేకం. ఇద్దరు ఎప్పుడు ఎదురుపడ్డ.. ఒకరిపై ఒకరు సరదా వ్యాఖ్యలతో పక్కనోళ్లను నవ్వుల్లో ముంచెత్తుతారు.
తాజాగా వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. బుధవారం నాడు బోయిగూడ రైల్వే కోర్టులో హాజరైన సందర్బంలో.. 'చిచ్చా.. జర పాన్, జర్దాలు తినడం మానేయ్యే..' అని కేటీఆర్ పద్మారావుకు సూచించగా, 'నీకు ఏ అలవాటు లేకనే గదా! నన్ను పాన్ మానేయమంటున్నవ్, నువ్వు కూడా ఈ చాకెట్లు తిను' అంటూ కేటీఆర్ కు చాక్లెట్లను ఇవ్వబోయారు పద్మారావు.
వీరిద్దరి మధ్య సరదా వ్యాఖ్యలతో కోర్టు ఆవరణలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారట. తెలంగాణ ఉద్యమం నాటి ఓ కేసుకు సంబంధించిన విషయంలో బుధవారం నాడు మంత్రి కేటీఆర్, మంత్రి పద్మారావు సహా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ బోయిగూడ రైల్వే కోర్టుకు హాజరయ్యారు.