హన్మంతన్నా ఇంటికి పోదాం నడువ్!: వీహెచ్తో కేసీఆర్ ఆసక్తికరం
'ఏం సీఎం సాబ్ మాకసలు టైమే ఇవ్వరా.. కలిసేందుకు అవకాశమే ఇవ్వరు!' అని కేసీఆర్ తో వీహెచ్ వాపోయారు.
హైదరాబాద్: రాజకీయాలకు ప్రత్యర్థులు గానీ ఆత్మీయ పలకరింపులకు ఏ పార్టీ అయితే ఏంటి? అందుకే వ్యక్తిగత విషయాలకు, కుటుంబ వ్యవహారాలకు రాజకీయాలకు అతీతంగా మసులుకునే నేతలు చాలామందే ఉంటారు. హోదాలను మరిచిపోయి.. మనిషి ఎదురుపడగానే 'నమస్తే సాబ్'అంటూ పలకరించే నేతలకు రాజకీయాల్లో కొదువలేదు.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య ఇలాంటి ఆసక్తికర సంభాషణే చోటు చేసుకుంది. 'ఏం సీఎం సాబ్ మాకసలు టైమే ఇవ్వరా.. కలిసేందుకు అవకాశమే ఇవ్వరు!' అని కేసీఆర్ తో వీహెచ్ వాపోయారు. వీహెచ్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. 'హన్మంతన్నా ఇంటికి పోదాం నడు' అంటూ కేసీఆర్ ఆయన్ను ఆహ్వానించారు. టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు మనువడి పెళ్లి సందర్బంగా ఈ సరదా సంభాషణ చోటు చేసుకుంది.
ఆ సమయంలో అక్కడే ఉన్న సీఎల్పీ నేత జానారెడ్డిని పలకరించి వీహెచ్ ను తీసుకుని ఇంటికి కదిలారు కేసీఆర్. కేసీఆర్ కారులో ఆయన కుటుంబ సభ్యులు ఉండటంతో ఆయన మరో కారులో ప్రగతి భవన్ కు చేరుకున్నారు. అనంతరం ప్రగతి భవన్ లో దాదాపు 40నిమిషాల పాటు సీఎంతో మంతనాలు జరిపారు వీహెచ్.
ఈ సందర్బంగా ఆయన పలు సమస్యల గురించి సీఎంకు వివరించారు. బతుకమ్మ కుంటను పరిరక్షించాలని కేసీఆర్ ని కోరగానే తక్షణం అడ్వకేట్ జనరల్ కు ఫోన్ చేసినట్టుగా వీహెచ్ తెలిపారు. అలాగే అంబర్ పేట్ లో జ్యోతిరావుపూలే అడిటోరియం కోసం చాలాకాలంగా అభ్యర్థిస్తున్నానని కేసీఆర్ తో వెల్లడించారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని వీహెచ్ తెలిపారు.
హనుమాన్ వ్యాయామశాల విషయంలోను కేసీఆర్ పాజిటివ్ గా స్పందించారని వీహెచ్ చెప్పారు. ఇక ప్రగతి భవన్ గురించి ప్రస్తావిస్తూ.. మధ్యప్రదేశ్ సీఎం కార్యాలయం చూసినప్పుడు.. మనకు కూడా అలాంటి సీఎం కార్యాలయం ఉంటే బాగుంటుందన్న ఆలోచన తనలో మొదలైందని కేసీఆర్ తనతో చెప్పినట్టుగా వీహెచ్ అన్నారు. దేశంలోనే ఆదర్శవంతమైన కార్యాలయాన్ని నిర్మించాలన్న ఉద్దేశ్యంతో ప్రగతి భవన్ నిర్మించినట్టుగా కేసీఆర్ చెప్పారని ఆయన పేర్కొన్నారు.