ఫ్యూచర్ గ్రూప్ చేతికి చంద్రబాబు హెరిటేజ్ రిటైల్!, అందుకే ఈ డీల్
హైదరాబాద్: హెరిటేజ్ రిటైల్ బిజినెస్ను ఫ్యూచర్ గ్రూపం సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. హెరిటేజ్ సంస్థ తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందినది అని తెలిసిందే.
హెరిటేజ్ రిటైల్ వ్యాపారానికి సంబంధించి ఆ సంస్థకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో వందకు పైగా రిటైల్ దుకాణాలు ఉన్నాయి.
1992లో చంద్రబాబు వ్యవస్థపకులుగా హెరిటేజ్ ఫుడ్స్ ప్రారంభమైంది. ఇందులోని ప్రధాన రిటైల్ విభాగాన్ని ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఇరు కంపెనీల మధ్యా చర్చలు జరుగుతున్నట్టు హెరిటేజ్ ఫుడ్స్ స్పష్టం చేసింది.
డెయిరీ వ్యాపారంతో పాటు హెరిటేజ్ ఫుడ్స్ పేరిట రిటైల్ చైన్ను సంస్థ నిర్వహిస్తోంది. ప్రస్తుతం సంస్థ ఆదాయం రూ.2,381 కోట్లకు చేరగా, 20 లక్షల మంది ఖాతాదారులను, 3.8 లక్షల చ.అ. వ్యాపార స్థలాన్ని కలిగి ఉన్నామని హెరిటేజ్ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. సంస్థలో 2,689 మంది ఉద్యోగులు ఉన్నారని వెల్లడించారు. డీల్ విలువ ఇంకా ఖరారు కాలేదన్నారు.
ఈ వార్త తెలియగానే బీఎస్ఈలో హెరిటేజ్ ఈక్విటీ విలువ ఏకంగా 10.20 శాతం పెరిగింది. ఈ డీల్ కుదిరితే.. విస్తరణ ప్రణాళికలను శరవేగంగా అమలు చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్నకు ఇది నాలుగో డీల్ కానుంది. సంస్థ రిటైల్ విక్రయ కేంద్రాలు 850కి పెరుగుతాయి. విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఫ్యూచర్ గ్రూప్ ఈ డీల్ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తోంది.