రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్ : నిషేధం విధించిన FWICE.. కారణమిదే...
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్(FWICE) వర్మపై నిషేధం విధించింది. తమ సంస్థకు చెందిన 32 యూనియన్లు ఇకపై రాంగోపాల్ వర్మతో పనిచేయబోవని స్పష్టం చేసింది. ఫిలిం ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు,టెక్నీషియన్లకు వేతనాలు ఇవ్వకుండా.. సుమారు రూ.1కోటి వరకు డబ్బును వర్మను ఎగ్గొట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
ఎన్నిసార్లు లేఖలు రాసినా...
వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్(FWICE) అధ్యక్షుడు బీఎన్ తివారీ,ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే మాట్లాడుతూ... సినీ ఆర్టిస్టులు,టెక్నీషియన్లకు చెల్లించాల్సిన వేతన బకాయిలపై రాంగోపాల్ వర్మకు లీగల్ నోటీసులు పంపించామన్నారు. అయినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందన గానీ లేదా వారికి వేతనాలు చెల్లించడం గానీ జరగలేదన్నారు. సెప్టెంబర్ 17,2020 నుంచి వర్మకు లేఖలు రాస్తూనే ఉన్నామని... వర్మ వాటిని తిరస్కరించడమో లేదా ఆమోదించడమో ఏదీ చేయలేదన్నారు.
గోవా ముఖ్యమంత్రికి కూడా...
గతేడాది సెప్టెంబర్లో వర్మ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం గోవా వెళ్లినట్లు తెలుసుకుని... అక్కడి ముఖ్యమంత్రికి కూడా దీనిపై లేఖ రాశామని బీఎన్ తివారీ వెల్లడించారు. అసలే కరోనా కాలం... పేద ఆర్టిస్టులు,టెక్నీషియన్లకు వేతనాలు ఎగ్గొట్టడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఇప్పటికీ వర్మ వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనతో కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
వరుస సినిమాలతో బిజీగా వర్మ...
రాంగోపాల్ వర్మపై నిషేధాన్ని ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(IMPPA)తో పాటు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు తెలియజేసినట్లు బీఎన్ తివారీ వెల్లడించారు. కాగా,రాంగోపాల్ వర్మ ప్రస్తుతం 12'O' క్లాక్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. లాక్ డౌన్ పీరియడ్లో రాంగోపాల్ వర్మ వరుసపెట్టి సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కరోనా,దిశా ఎన్కౌంటర్,నగ్నం వంటి పలు సినిమాలను ఆయన లాక్ డౌన్లోనే తెరకెక్కించారు.