అగ్రిగోల్డ్ ఆస్తులను రూ.4వేల కోట్లకు కొనుగోలు చేస్తాం కానీ: జీఎస్సెల్ గ్రూప్
హైదరాబాద్/అమరావతి: అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ను తాము రూ.4వేల కోట్లకు కొనుగోలు చేస్తామని జీఎస్సెల్ గ్రూప్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. కొనుగోలు ప్రక్రియను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని తెలిపింది.
జీఎస్సెల్ గ్రూప్ ప్రతిపాదనలను విన్న హైకోర్టు.. దీనిపై తమ అభిప్రాయం తెలపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, బాధితులకు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, రూ.4వేల కోట్లకు కొనుగోలు చేస్తామని, ఈ ప్రక్రియను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని జీఎస్సెల్ సంస్థ కోరగా.. మొదట పిటిషనర్, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు అభ్యంతరం తెలిపారు.
ఒకవేళ సంస్థ ఆస్తులను జీఎస్సెల్ కొనుగోలు చేస్తే తొలుత రూ.500 కోట్లు డిపాజిట్ చేయాలని, ఏడాదిలోపు మొత్తం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని వారు కోరారు. అయితే జీఎస్సెల్ ప్రతిపాదనపై ప్రభుత్వాలు, అగ్రిగోల్డ్ బాధితుల అభిప్రాయాన్ని హైకోర్టు కోరింది.