కెసిఆర్ ప్రభుత్వం కూడా అలాగే: విరుచుకు పడ్డ గద్దర్
ప్రజల ఓట్లతో పీఠమెక్కుతున్న దేశ, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అనాధిగా వారిని అణచివేతకే గురిచేస్తున్నాయని ప్రజా గాయకుడు గద్దర్ అభిప్రాయపడ్డారు.
ఆదిలాబాద్: ప్రజల ఓట్లతో పీఠమెక్కుతున్న దేశ, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అనాధిగా వారిని అణచివేతకే గురిచేస్తున్నాయని ప్రజా గాయకుడు గద్దర్ అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం, సంక్షేమం, సమగ్ర అభివృధ్ధికోసం పురుడుపోసుకున్న 'టీ- మాస్' ఆవిర్భావ సభకు హజరయిన ఆయన ప్రభుత్వాల పనితీరును ఎండగట్టారు.
ఆదిలాబాద్లోని టీఎన్జీవోస్ భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి జిల్లాలోని 102 వివిధ కుల, మత, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సభ్యులు వేలసంఖ్యలో హాజరయ్యారు. గద్దర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రజలపట్ల ఏవిధంగా వ్యవహరించారో, ప్రస్థుత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకూడా అలాగే వ్యవహరిస్తుందన్నారు.
అధికారమే అంతిమ లక్ష్యంగా భావించే ఈ పార్టీలన్నింటికీ కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల కష్టాలు గుర్తొస్తాయన్నారు. జిల్లాలోని భీంపూర్, తాంసి మండలాల్లో పుష్కలమైన మాంగనీస్ ఘనులు ఉన్నప్పటికీ వాటితో ప్రజలకు ఎలాంటి లాభం లేదని, కేవలం కొందరు నాయకుల వ్యాపారాల కోసమే గనులు ఉపయోగపడుతున్నాయన్నారు.
పత్తి, సోయా పంటలనే పండించే ఇక్కడి రైతులకు అనాదిగా అన్యాయమే జరుగుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఇంద్రవెల్లి, గుడిహత్నూర్లలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభిస్తే ఉన్నచోటే గిట్టుబాటు ధరకు విక్రయించుకునే వీలుందన్నారు.
వివిధ కులాల వేషధారణతో ప్రభుత్వాల పనితీరు ప్రజలకు అర్ధమయ్యేలా నాటిక చేయించారు. టీ మాస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్ధానాలు చేసిన రాష్ట్ర సర్కారు ఇప్పటివరకు ఎక్కడ డబుల్ బెడ్రూం, కేజీ టుపీజీ ఇంగ్లీషు మీడియం చదువు, ఎస్సీలకు మూడెకరాల భూమి ఇచ్చిందో చూపంచాలని డిమాండ్ చేశారు.
ప్రజలంతా ఒక్కటయ్యే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో టీ మాస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు జాన్ వెస్లీ, శ్రీరాం నాయక్, ఒంగూర్ రాములు, సయ్యద్ జావిద్, మల్లేష్, నాయకులు దారట్ల కిష్టు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, రిమ్స్ ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.