వర్సిటీలు ఎలా ఉండాలో మేనిఫెస్టోలు రూపొందించండి: గద్దర్, పట్టించుకోలేదు: విహెచ్
హైదరాబాద్: విశ్వవిద్యాలయాలు ఎలా ఉండాలో మేనిఫెస్టోలు తయారు చేయాలని ప్రజాయుద్ధ నౌక గద్దర్ గురువారం నాడు అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దీక్ష చేస్తున్న విద్యార్థులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
వేముల రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. రోహిత్కు న్యాయం జరిగే వరకు అందరూ ఒక్కటి కావాలని గద్దర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
దేశంలో పెరిగిపోతున్న అసహనానికి రోహిత్ బలయ్యాడని సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. కాగా రోహిత్ మృతిని నిరసిస్తూ రేపు ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ బంద్కు స్థానిక విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు: విహెచ్
ఎన్డీయే అధికారంలోకి వచ్చాక సెంట్రల్ వర్సిటీలో ఏబీవీపీ కార్యకలాపాలు పెరిగాయని కాంగ్రెస్ ఎంపీ వి హనుమంత రావు మండిపడ్డారు. వీసీ అవినీతి పైన ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. అన్ని రాజకీయ పక్షాల ఒత్తిడితోనే విద్యార్థుల పైన సస్పెన్షన్ ఎత్తివేశారని, కేంద్రం స్పందించి విద్యార్థులు భవిష్యత్తు కాపాడాలన్నారు.