గజ్వేల్ పై గద్దర్ కన్ను..! కూటమి నేతలు అంగీకరిస్తారా..?
హైదరాబాద్: పొడుస్తున్న పొద్దుమీద.. అంటూ తెలంగాణ ఉద్యమాన్ని తన పాటతో శిఖరాగ్రానికి తీసుకు వెళ్లిగా ప్రజా గాయకుడు గద్దర్. ఇన్నేళ్ల ఉద్యమ జీవితంలో ఎప్పుడూ ఎన్నికలకు మద్దతు పలకని గద్దర్ తాజాగా కొత్త రాగం వినిపిస్తున్నారు. 70 ఏళ్ల జీవితంలో తొలిసారిగా ఓటు వేయనున్న గద్దర్ గడచిన జులైలోనే ఓటర్ల జాబితాలో తన పేరు నమోదు చేసుకున్నారు. నక్సలైట్ నాయకుడిగా బ్యాలెట్ ను వ్యతిరేకించిన ఆయన చాలా ఆలస్యంగానైనా పార్లమెంటరీ పంథాలోకి మళ్లడాన్ని సమర్థిం చుకుంటున్నారు. స్వతంత్ర్య తెలంగాణలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చంద్రశేఖర్ రావు గొడ్డలిపెట్టుగా మారినందుకే ఆయనకు వ్యతిరేకంగా రాజకీయాల్లో కి వస్తున్నట్టు ప్రకటిస్తున్నారు గద్దర్.
కేసీఆర్ పాలనపై విప్లవ గీతం..! ప్రజాగాయకుడి దిక్కార రాగం..!!
కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో తెలంగణ వీరుల త్యాగాలు వృథా అయ్యాయయని, అందుకే ప్రజా ప్రతినిధిగా ఎన్నికవ్వాలనుకుంటున్నానని గద్దర్ స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో పేదలకు డబుల్బెడ్రూం, విద్యార్థులకు కేజీ టు పీజీ విద్య, దళితులకు మూడెకరాల భూమి, అందరికీ ఆరోగ్యం, నిరుద్యోగులకు లక్ష కొలువులు వచ్చాయా? లేదా అనే అంశాలను వివరించడానికి ప్రజా చైతన్య యాత్ర చేపట్టడానికి గద్దర్ సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. దీనికితోడు అన్ని పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నిలబడతానని గద్దర్ ప్రణాళికలు రచించుకుంటున్నారు.
ఓటురుగా నమోదు చేసుకున్న గద్దర్..! ఇక ప్రజా చైతన్యం తీసుకొస్తా అంటున్న గాయకుడు..!!
దీనికితోడు ఓటరుగా తొలిసారి తన పేరు నమోదు చేసుకున్న ఆయన ఓటు హక్కు వినియోగంపై రాష్ట్రమంతటా తిరిగి ప్రజల్లో అవగాహన కల్పిస్తానని చెబుతున్నారు. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణలోని గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని కూడా చెబుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని నియోజక వర్గాల్లో ప్రజలకు ఓటు విలువను తెలియజేస్తానని గద్దర్ అంటున్నారు. ఓడటరుగా నమోదు చేసుకోవడమే తన ఇన్నేళ్ల జీవితంలో వచ్చిన పెను మార్పని గద్దర్ వివరించడం విశేషం.
గద్దర్ కొత్త వ్యూహం..! వినూత్న రీతిలో ప్రచారం..!!
ప్రజలు స్వేచ్చగా ఓటు వేస్తే దేశంలో 25 శాతం ప్రజాస్వామ్యం బతికి వున్నట్టే అని గద్దర్ అభిప్రాయ పడుతున్నారు. అయితే ఉన్నట్టుండి గద్దర్ ఇలా మారిపోవడం, ఓటర్ ఆవగాహన అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడం వెనక వున్న ప్లానేంటనేది తెలియక అధికార, విపక్షాలకు చెందిన నేతలు అయోమయానికి గురవుతున్నట్టు సమాచారం. మరోవైపు గద్దర్ దీనిని సాకుగా చూపించి తన ప్రచారం మొదలుపెడతారని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
కేసీఆర్కు చెమటలు పట్టించిన ఒంటేరు..! అంత తేలిగ్గా ఒదిలే అవకశం లేదు..!!
అయితే గద్దర్ అభ్యర్థిత్వాన్ని కూటమి పార్టీలు అంగీకరిస్తాయా లేదా అన్నది తేలడంలేదు. గజ్వేల్ నుంచి కాంగ్రెస్ తరపున ఒంటేరు ప్రతాపరెడ్డి రంగంలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో ఈయన తెలుగుదేశం పార్టీలో చురుకుగా వ్యవహరించారు. దీనికితోడు గత ఎన్నికల్లో కేసీఆర్కు చెమటలు పట్టించారని చెప్పుకుంటారు. కేసీఆర్ గజ్వేల్లో పోటీ చేయకపోతే, ప్రతాపరెడ్డే గెలిచేవారని స్థానికులు అంటుంటారు. మరి ఇటువంటి పరిస్థితిలో గద్దర్ గజ్వేల్ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.