ఏ పార్టీలో చేరను, మీదే బాధ్యత: రాహుల్, సోనియాతో గద్దర్ ఫ్యామిలీ, ‘కొడుకుతోపాటు 3సీట్లు’
న్యూఢిల్లీ: తాను ఏ పార్టీలో చేరబోయేది లేదని, తాను స్వతంత్ర అభ్యర్థిగానే గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భేటీ అయ్యారు.
రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రాహుల్ను కోరారు. అనంతరం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ గద్దర్ సమావేశమయ్యారు. తన ఉద్యమ కార్యాచరణను ఆమెకు వివరించారు.
టీడీపీ అంటే చంద్రబాబుది కాదు, సీఎం కావాలని కోరితే తప్పేంటి?: జానారెడ్డి ఆసక్తికరం
రాహుల్ గాంధీకి మద్దతు
కేంద్రంలో బూర్జువా వ్యవస్థ పాలన సాగుతోందని.. అది పోయేందుకే రాహుల్ గాంధీ తీసుకున్న ‘రాజ్యాంగాన్నికాపాడి దేశాన్ని కాపాడండి' ఉద్యమానికి మద్దతు గద్దర్ తెలిపారు. తెలంగాణలోనూ రాజ్యాంగ రక్షణ అవసరమని, రాష్ట్రంలో నయా ఫ్యూడలిజం వచ్చేసిందని గద్దర్ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీదే బాధ్యత
త్యాగాలు చేసిన వారికి తెలంగాణ ఫలాలు చేరలేదని, ఫ్యూడల్ చేతుల్లో నుంచి తెలంగాణను విముక్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందని తెలిపారు. కవులు, కళాకారుల తరుపున తెలంగాణలో సోనియా గాంధీ పర్యటనను స్వాగతిస్తున్నామన్నారు.
ఏ పార్టీలో చేరను కానీ.. కేసీఆర్పై పోటీ చేయమంటే..
తాను ఏ పార్టీలోనూ చేరనని.. పార్టీలూ, ప్రజలు కోరితే కేసీఆర్పై గజ్వేలు నుంచి పోటీచేసేందుకు సిద్ధమని గద్దర్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు మధుయాష్కి, కొప్పుల రాజుతో కలిసి గద్దర్ తన భార్య విమల, కుమారుడు సూర్యకిరణ్తో సోనియా, రాహుల్ వద్దకు వెళ్లారు.
కూటమి తరపున గద్దర్ ప్రచారం..?
కాగా, మహాకూటమికి అనుకూలంగా ప్రచారం చేయనున్న గద్దర్కు ఉత్తర తెలంగాణ, సింగరేణి ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలను అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలిసింది.
కుమారుడితోపాటు మూడు సీట్లు కోరిన గద్దర్?
కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన కుమారుడు సూర్యకిరణ్కు పార్టీ తరపున బెల్లంపల్లి సీటుతో పాటు మరో ఇద్దరు అనుచరులకు కాంగ్రెస్ పార్టీ నుంచి గద్దర్ సీట్లు కోరినట్లు తెలిసింది. బెల్లంపల్లి టికెట్ ఆశిస్తున్న సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ను పోటీ నుంచి తప్పించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డిని కోరతారని భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానంతో గద్దర్ చర్చలు కొలిక్కిరానున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
సోనియా ఫ్యామిలీపై గద్దర్ భార్య
యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ దయవల్ల తెలంగాణ రాలేదని సీఎం కేసీఆర్ అనడం సరికాదని గద్దర్ సతీమణి విమల అన్నారు. దేశం కోసం సోనియా కుటుంబం త్యాగాలు చేసిందన్నారు. సోనియాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆందోళనలు చేయడం వల్ల తెలంగాణ రాలేదని, ఎందరో విద్యార్థుల ప్రాణ త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు విమల.