డిజిపితో గద్దర్ భేటీ: బాబు హయాంలోని దాడి కేసును తిరగదోడుతారా?
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ మంగళవారంనాడు తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మను కలిశారు. తనపై జరిగిన దాడిపై పునర్విచారణ చేయాలని ఆయన డిజిపిని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఆయన కేసును తిరగదోడుతారా అనే చర్చ ప్రారంభమైంది.
గద్గర్పై 1997 ఏప్రిల్ 6వ తేదీన దాడి జరిగింది. ఆయన శరీరంలో పలు బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్లను వైద్యులు తొలగించారు గానీ ఒక్క బుల్లెట్ ను మాత్రం తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికీ బుల్లెట్ ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్వాల్లోని నివాసంలో గద్దర్పై దాడి చేశారు. ఈ దాడిలో నయీం ముఠా హస్తం ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో పోలీసుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వచ్చాయి.
గుమ్మడి విఠల్ రావు అయిన గద్దర్ విప్లవ భావజాలాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. తన పాటల ద్వారా, ప్రదర్శనల ద్వారా విప్లవోద్యమం వైపు ప్రజలను ఆకర్షించే పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ కోసం ఆయన గజ్జె కట్టి ఆడారు. 2002 లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ తమ దూతలుగా గద్దర్, వరవరరావులను ఏర్పాటు చేసుకున్నారు.