వరంగల్లో పోటీకి గద్దర్ సుముఖం: తమ్మినేని వీరభద్రం
నిజామాబాద్/ మెదక్: వరంగల్ లోక్సభ స్థానానికి పోటీ చేసేందుకు ప్రజా గాయకుడు గద్దర్ సుముఖంగానే ఉన్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం నిజామాబాద్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తమ్మినేని పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. వరంగల్ ఉపఎన్నికలో ఆ పార్టీకి పరాభవం తప్పదన్నారు. గద్దర్ వరంగల్ స్థానానికి పోటీ చేస్తే మద్దతిస్తామని కాంగ్రెస్, బీజేపీ, నేతలు చెప్పారని తమ్మినేని తెలిపారు.
వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్ను వరంగల్లో పోటీకి దించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గద్దర్ను ఒప్పించేందుకు ఇటీవల వామపక్షాల నేతలు గద్దర్ను కలిశారు. అయితే, గద్దర్ తన నిర్ణయాన్ని ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల పరిహారాన్ని ఇవ్వాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. గురువారం ఆయన మెదక్లో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులన్నీ రీడిజైన్ చేయాలని సూచించారు. అప్పుల్లో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోదండరాం అన్నారు. పార్టీలకతీతంగా రైతులకు అండగా నిలుద్దామని కోదండరాం పిలుపునిచ్చారు.