గద్దర్ అడుగు కూడా మహాకూటమి వైపే..!! ఇక గులాబీ పార్టీకి చెమటలే..!!
హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అదికార గులాబీ పార్టీని నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ శక్తి వంచన లేకుండా పావులు కదుపుతోంది. కలిసివచ్చే పార్టీలతో కదన రంగంలో దూకేందుకు సంకేతాలు ఇస్తూనే భావసారూవ్యం ఉన్న నేతల సంఘీభావాన్ని కూడగట్టుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం తెలంగాణ మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల మద్దత్తును కూడగడుతోంది. ఇందులో భాగంగానే ప్రజా గాయకుడు గద్దర్ ను సంప్రదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తమతో కలిసి పనిచేసేందుకు చేయి కలపాలని కోరినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకుల అభ్యర్థనకు ప్రజా గాయకుడు గద్దర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. గద్దర్ మహాకూటమిలో చేరిపోతే తెలంగాణ యువత గజ్జెకట్టి చిందేయడం ఖాయంగా కనిపిస్తోంది.
పోరు తెలంగాణమా..? కోట్లాది ప్రాణమా..? ఈ గాత్రం ఇప్పుడు మహాకూటమి వైపు..!
తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ను అధికారంలోకి రానీయకుండా చేసేందుకు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఏకమౌతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు తోడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి, సీపీఐ కలిసి మహాకూటమిగా ఏర్పడబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన తొలిదశ చర్చలు పూర్తయిన విషయం తెలిసిందే. చెరుకు సుధాకర్ స్థాపించిన తెలంగాణ ఇంటి పార్టీ కూడా మహాకూటమికి మద్దతు తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ చాలా బలపడింది.
టీఆర్ఎస్ కు ధీటుగా ఆటా..పాట..! తెలంగాణ యువతకు సూపర్ జోష్..!
దీనికి తోడు టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతను కూడా వాడుకుని మహాకూటమితో విజయం సాధించాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్కు అధికారం దక్కకుండా చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, కొన్ని స్థానాలను మిత్రపక్షాలకు వదలుకోడానికి కూడా సిద్ధమైంది. ఇతర పార్టీలను కూడా కలుపుకుని ఒకే మేనిఫెస్టో రూపొందించి బహిరంగ సభలను నిర్వహించాలని కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ భావిస్తోంది. దీనితో పాటు టీఆర్ఎస్కు దీటుగా ప్రచారం చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క తో గద్దర్ భేటీ..!!
అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమైంది. ఆ పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖులను కలుసుకుని, తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రజా యుద్ధ నౌక గద్దర్ను ఇటీవల కాంగ్రెస్ కీలక నేత, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క కలిశారు. ఆయనతో సుదీర్ఘ సమయం పాటు సమావేశం అయ్యారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సామాన్య ప్రజల కోసం కవులు, కళాకారులు, ప్రజా గాయకుడు గద్దర్ వంటి వారు కలిసిరావలని భట్టి విక్రమార్క కోరారని తెలుస్తోంది. అందుకుగానూ ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించారని, ఒకవేళ అలాంటి ఆలోచన లేకుంటే ఎన్నికలప్రచారంలో సహకరించి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని విన్నవించినట్లు సమాచారం.
మహాకూటమికి గద్దర్ ప్రత్యేక ఆకర్శణ..! యువతలో మార్పును తీసుకురాగల గద్దర్ పాట..!!
దీనిపై గద్దర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. తన ఆట పాటలతో ప్రజలను చైతన్య పరిచిన గద్దర్ ఎన్నికలకు సిద్దమంటు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. తెలంగాణ వచ్చిన తర్వాతే ఆయన రాజకీయ పార్టీ స్థాపించాలని ప్రయత్నాలు చేశారు. కానీ కుదరలేదు. అయితే, ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ మహాకూటమిలో చేరిపోతే మాత్రం కూటమికి గద్దర్ అదనపు ఆకర్శణతో పాటు యువతను తన ఆట పాటతో క్కిక్కెంచే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.