గగ్గలపల్లి పోలింగ్ ఎందుకు రద్దంటే ? ఆ అంశం రుజువైతే పోటీకి అభ్యర్థులు దూరం ?
హైదరాబాద్ : స్థానిక సంస్థల మూడు విడతల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయని ఎన్నికల సంఘం తెలిపింది. నాగర్ కర్నూలు జిల్లా గగ్గలపల్లిలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ రద్దు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు.
ఇదీ విషయం
గగ్గలపల్లిలో భారీగా నగదు వెలుగులోకి వచ్చిందని ఆయన తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికను రద్దు చేసినట్టు వివరించారు. గగ్గనపల్లికి సంబంధించి క్రిమినల్ క్రిమినల్ కేసు కూడా నమోదైందని వివరించారు. అది విచారణలో ఉందని .. నిరూపణ అయితే అభ్యర్థులు ఆరేళ్లపాటు పోటీకి అనర్హులవుతారని తెలిపారు.
77.46 శాతం పోలింగ్
పరిషత్ ఎన్నికల్లో 77.46 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. జూలై తర్వాతే పరిషత్ కొత్త పాలకమండళ్లు ఏర్పడతాయని వెల్లడించారు. మూడుచోట్ల బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో రీపోలింగ్ నిర్వహించామన్నారు. బ్యాలెట్ పత్రాల ఫొటోలు బయటకు రావడంపై 4 కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగతా జిల్లాల్లో ప్రస్తుత ఎంపీపీల పదవీకాలం జులై 3తో, జడ్పీల పదవీకాలం జులై 4తో ముగుస్తోంది. ఖమ్మంలో ఎంపీపీల పదవీకాలం ఆగస్టు 5తో.. జడ్పీ పదవీకాలం ఆగస్టు6తో పూర్తవుతుంది. పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గగా.. శాసనసభ, లోక్సభ ఎన్నికల కంటే అధికంగా నమోదైందని నాగిరెడ్డి వివరించారు.
పటిష్ట భద్రత
ఎన్నికల్లో 1,20,86,395 మంది ఓట తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలిపారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 87.02 శాతం, అత్యల్పంగా వికారాబాద్లో 70.40 శాతం పోలింగ్ నమోదైంది. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని వివరించారు. 123 కేంద్రాల్లోని 978 హాళ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని .. 11,882 మంది సూపర్వైజర్లు, 23,647 మంది అసిస్టెంట్ల సేవలు వినియోగించుకుంటామని తెలిపారు. 534 స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశామని వివరించార. పోలింగ్ కేంద్రాల వారీగా లెక్కింపు ఉంటుందని .. ముందు బ్యాలెట్ పత్రాలను పెట్టెలో నుంచి తీసి లెక్క సరిచూస్తారని వివరించారు. ముందు ఎంపీటీసీల ఓట్లు లెక్కిస్తాం. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక జడ్పీటీసీ ఓట్లు లెక్కింపు జరుగుతుందని చెప్పారు.