టిడిపి కొత్త ట్విస్ట్: 'నిజాం రాజులు నిర్మించిన భవనాలపై ఏపీకీ హక్కు'
హైదరాబాద్: హైదరాబాదులో నిజాం రాజులు నిర్మించిన భవనాల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా హక్కు ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మండలి సభ్యులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. నిజాం నవాబులు నిర్మించిన భవనాలపై తెలంగాణ రాష్ట్రానికి ఎంత హక్కు ఉందో, అంతే హక్కు ఏపీకి ఉందన్నారు.
విభజన చట్టంలోని 9, 10 షెడ్యూలులోని 175 సంస్థలు కాకుండా, ఈ పరిధిలోకి రాని 37, ఇతరత్రా 216 సంస్థలు ఉన్నాయని చెప్పారు. వాటి పైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో తమ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని చెప్పారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం సహకరించడం లేదన్నారు.
ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై విజయవాడ ప్రభుత్వ గెస్ట్ హౌస్లో ఏపీ మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. భేటీలో మంత్రులు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఆర్థికమంత్రి యనమల మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళిక నిధుల వినియోగంపై సమీక్షించినట్లు చెప్పారు. బీసీ ఉప ప్రణాళిక నిధుల వినియోగం నత్తనడకన సాగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రూ.25వేల కోట్లు ఖర్చుపెడుతున్నామన్నారు.