వరంగల్లో మంత్రులకు షాక్, ఐనా భారీ మెజార్టీ: గాలి అనుమానం, సంచలన వ్యాఖ్య
హైదరాబాద్: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన గాలి వినోద్ కుమార్ గురువారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కెసిఆర్ రూ.వంద కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రచారంలో కెసిఆర్, మంత్రులు, నాయకులను ప్రజలు పెద్ద ఎత్తున అడ్డుకున్నారని, నిరసన తెలిపారని గుర్తు చేశారు. మంత్రులతో సహా అందర్నీ ప్రజలు అడ్డుకున్నారని, అలాంటప్పుడు అంత భారీ మెజార్టీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
ఇంత భారీ మెజార్టీ రావడానికి ఈవీఎం మిషన్ల ట్యాంపరింగ్ కారణమని ఆరోపించారు. పీజీ న్యాయ కళాశాలలో గురువారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు భారత రాజ్యాంగం పైన ప్రత్యేక పరీక్ష నిర్వహించాలన్నారు.
మీడియాకు బెదిరింపు: టిడిపి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టిడిపి నేతలు మరోసారి మండిపడ్డారు. టీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టింది ప్రతిపక్షాలు, మీడియాపై ఆంక్షలు విధించడానికి కాదని వారు ధ్వజమెత్తారు. వరంగల్ ఉప ఎన్నిక తర్వాత విపక్షాలను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు.
తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నరిసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మీడియాపై ఆంక్షలు విధించి కేసీఆర్ వేధిస్తున్నారన్నారు. గతంలో పలు అంశాలపై విపక్షాలు పోరాడిన తర్వాత వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు.