కవలలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ.. గాంధీ ఆస్పత్రిలో పురుడుపోసిన వైద్యులు
కరోనా మహమ్మారికి చిన్న పెద్ద తేడా లేదు.పేద గొప్ప భేదం లేదు.మహిళలా, పురుషులా అన్న వ్యత్యాసం లేదు. అలాంటి కరోనా మహమ్మారి గర్భిణీలను సైతం వదిలి పెట్టటం లేదు. అయినా వైద్యులు వారిని కాపాడే పనిలో ఉన్నారు. నెలలు నిండిన కరోనా పాజిటివ్ గర్భిణీకి సిజేరియన్ నిర్వహించి సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రసవం చేశారు. ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది.
కరోనా పాజిటివ్ మహిళకు పురుడుపోసిన గాంధీ వైద్యులు
మేడ్చల్కు చెందిన గర్భిణి రెండు రోజుల క్రితం డెలివరీ కోసం నీలోఫర్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే అక్కడ వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించి ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు.కరోనా పాజిటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రిలో సదరు గర్భిణీ చికిత్స పొందుతోంది. దీంతో ఆమెకు డెలివరీ సమయం దగ్గరకు రావడంతో మంగళవారం వైద్యులు ఆమెకు ప్రత్యేక వైద్య సహాయాన్ని అందించి శస్త్రచికిత్స చేశారు. ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
శిశువులకు కరోనా పాజిటివ్ పరీక్షలు
ఇక కరోనా పాజిటివ్ ఉన్న ఆ తల్లి వద్దనుండి శిశువులను వేరు చేసి ఐసీయూలో ఉంచినట్టు చెప్పారు. అంతేకాదు శిశువులకు సైతం కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లుగా వైద్యులు చెప్పారు.రిపోర్టులు పరిశీలించి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి శిశువులను తల్లి దగ్గరికి చేరుస్తామని చెప్పారు. కరోనా పాజిటివ్ ఉన్న తల్లి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి నెగిటివ్ గా మారిన తర్వాత శిశువులను తల్లి దగ్గరకు చేర్చే అవకాశం ఉంది. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎం. రాజా రావు మాట్లాడుతూ కోవిడ్ పాజిటివ్ గర్భిణీలు ఆసుపత్రిలో డెలివరీ అయిన ఐదవ కేసు ఇది. అలాంటి మొదటి కేసు మే 8 న నమోదైంది.
వైరస్ వ్యాపించకుండా వేరు వేరు గదుల్లో తల్లీ బిడ్డలు
అన్ని సందర్భాల్లో, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి నవజాత శిశువులు మరియు తల్లులు వేర్వేరు వార్డులలో ఉంచుతున్నారు . నవజాత శిశువులను కూడా పరీక్షించేందుకు నమూనాలను మూడుసార్లు సేకరిస్తారు. సిజేరియన్ ద్వారా కవలలను ప్రసవించిన మేడ్చల్ మహిళ గురించి డాక్టర్ రాజారావు మాట్లాడుతూ, ఆమెను మొదట నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. "పాజిటివ్ (కరోనావైరస్ కోసం) పరీక్షించిన తరువాత, ఆమెను మంగళవారం గాంధీ ఆసుపత్రికి పంపించారు. ఆమె సాయంత్రం కవలలను ప్రసవించింది. ఒక శిశువు బరువు 2.5 కిలోలు,మరో శిశువు 2 కిలోలు,ఉందని ఆయన చెప్పారు .
ఇప్పటి వరకు ఐదుగురు పాజిటివ్ మహిళలకు కాన్పు చేసిన గాంధీ డాక్టర్లు
కరోనా ప్రబలుతున్న నాటి నుండి నేటి వరకు గాంధీ ఆసుపత్రి వైద్యులు ఇదే తరహాలో కరోనా పాజిటివ్ గర్భిణీ మహిళలకు శస్త్ర చికిత్స నిర్వహించి పురుడు పోస్తున్నారు. ఇక ఇప్పుడు ఇద్దరు కవలలకు ప్రాణం పోశారు . తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 71 మంది కరోనా బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ నెలకొంది. ఇప్పటివరకు మిగతా జిల్లాల్లో కాస్త కరోనా తగ్గుముఖం పట్టినా హైదరాబాద్ పరిధిలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి.
Recommended Video
రోజురోజుకీ ఆందోళనకరంగా కేసులు .. అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు
గత 24 గంటల్లో నమోదైన కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 38 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో 7 కేసులు, మేడ్చల్ జిల్లాలో 6, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట్ జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైనట్లు తెలిపింది. తాజాగా 12 మంది వలస కార్మికులు, నలుగురు విదేశాల నుంచి వచ్చిన వారు కరోనా బారినపడ్డారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య ఒక 1991కి చేరింది. మంగళవారం ఒకరు మృతి చెందగా.. కరోనా మరణాల సంఖ్య 57కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 650 యాక్టివ్ కేసులున్నాయి. ఏది ఏమైనా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వైద్యులు అందిస్తున్న సేవలు మాత్రం కొనియాడదగినవి.