ప్రభుత్వానికి గాంధీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది షాక్.. డిమాండ్లు నెరవేర్చాలని సమ్మె నోటీసులు..
తెలంగాణలో ప్రధాన కరోనా ఆసుపత్రిగా సేవలందిస్తోన్న సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె నోటీసులు ఇచ్చారు. తమను రెగ్యులరైజ్ చేయాలని లేదా కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం(ఏప్రిల్ 14)న గాంధీ ఆసుపత్రి ఇన్వార్డులో సమ్మె నోటీసులు అందించినట్టు ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సుల యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ప్రాణాలకు తెగించి కరోనా సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని.. తమకు కూడా తగిన గుర్తింపునివ్వాలని కోరారు.
వేతనాలు సరిగా అందడం లేదని.., ఇన్సెంటివ్స్పై అసంతృప్తి..
గాంధీ ఆసుపత్రిలో దాదాపు 200 మంది నర్సులు 13 ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో సేవలు అందిస్తున్నారు. మరో 150 మంది సిబ్బంది కూడా ఔట్ సోర్సింగ్ విధుల్లో ఉన్నారు. ప్రతీ నెలా వేతనాలు కూడా తమకు సరిగా అందడం లేదని.. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం తమ సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు రూ.7500 ఇన్సెంటివ్ ప్రకటించిన ప్రభుత్వం.. తమకు కేవలం 10శాతం ఇన్సెంటివ్ ప్రకటించడం కంటి తుడుపు చర్యేనని విమర్శించారు.
డిమాండ్ నెరవేర్చకపోతే సమ్మె..
ప్రస్తుతం తమకు రూ.17,500 వేతనం మాత్రమే అందుతోందని చెప్పారు. నిజానికి ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులకు రూ.23,000 ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు పట్టించకోవడం లేదన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న కొందరు నర్సులకు మాత్రమే ఆ వేతనాలు ఇస్తున్నారని చెప్పారు. రెగ్యులరైజ్ లేదా కాంట్రాక్ట్ పద్దతిలో తమను తీసుకోకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
Recommended Video
కరోనా విజృంభిస్తున్న వేళ సమ్మె నోటీసులా?
గాంధీలో దాదాపు 350 మంది సిబ్బంది ఔట్ సోర్సింగ్ విధుల్లో ఉన్నారు. వీరంతా సమ్మెకు దిగితే తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో వీరి సేవలు కీలకంగా మారాయి. అయితే ఇలాంటి విపత్కర సమయంలో సమ్మెకు నోటీసులు ఇవ్వడంపై కూడా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిమాండ్ల పరిష్కారానికి ఇదే అదనుగా భావించడం సరికాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరి సమ్మె నోటీసు పట్ల ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.