తల్లి ప్రోద్భలం.. సీరియల్స్ నేర్పిన అనుభవం.. పక్కా ప్రొఫెషనల్ గా ఏం చేశాడంటే..
తల్లి ప్రోద్భలంతో నేరం చేయడానికి సిద్ధమై... టీవీ సీరియల్స్ చూసి పక్కా ప్రొఫెషనల్గా మారిన ఓ బాల నేరస్థుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు ఆమె తల్లిని మరో వ్యక్తిని కూడా పోలీసులు పట్ట
హైదరాబాద్: తల్లి ప్రోద్భలంతో నేరం చేయడానికి సిద్ధమై... టీవీ సీరియల్స్ చూసి పక్కా ప్రొఫెషనల్గా మారిన ఓ బాల నేరస్థుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు ఆమె తల్లిని మరో వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు.
మధ్య మండల డీసీపీ జోయల్ డెవిస్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన మంగాయమ్మ తొమ్మిదేళ్లుగా వారాసిగూడలో ఉంటోంది. ఆమె తన కొడుకును ఏడో తరగతి వరకు చదివించింది.
ఆపై చదువు మానేసిన ఆ బాలుడు ఆటోడ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇంట్లో అవసరాలు తీర్చేందుకు అప్పుడప్పుడు చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడు. వీటితో ఉపయోగం లేదని, ఒకేసారి భారీ మొత్తం కొల్లగొడితే తమ ఆర్థిక బాధలు తీరిపోతాయని అతడి తల్లి హితబోధ చేసింది.
దీంతో అతడు గత నెల 25న చిలకలగూడలోని ఓ ఇంట్లో దొంగతనానికి యత్నించాడు. యజమానులు మెలకువగా ఉన్నట్లు గ్రహించి, అక్కడి నుంచి వచ్చి కవాడిగూడ ప్రాంతంలో తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసుకున్నాడు.
ఆధారాలు దొరక్కుండా...
ఇది ఆ మైనర్ చేస్తున్న తొలి నేరమే అయినప్పటికీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. ఆ ఇంటి వెనుక వైపు ఉన్న మరో ఇంటి గోడ ద్వారా లోపలకు ప్రవేశించి ఐరన్ రాడ్తో అల్మారా ధ్వంసం చేశాడు.
అందులో ఉన్న కేజీ బంగారు ఆభరణాలు మూటగట్టుకున్నాడు. ఆ ఇంట్లోని వంటగదిలో ఉన్న కారం పొడి తీసుకుని ఘటనా స్థలంలో చల్లాడు. ఇలా చేస్తే పోలీసు జాగిలాలు నేరగాడి రాకపోకల్ని గమనించలేవని కొన్ని టీవీ సీరియల్స్లో చూసిన అనుభవం అతడి చేతం ఆ పని చేయించింది.
అనంతరం చోరీ సొత్తుతో కాకినాడ వెళ్ళిపోయిన తల్లీకొడుకులు తమ సమీప బంధువైన టి.శ్రీనివాసరావుకు ఆ బంగారు నగలు విక్రయించారు. అక్కడ నుంచి యానాం తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి...
ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసుల తొలుత అది పక్కా ప్రొఫెషనల్ పనిగా భావించారు. అనేక కెమెరాల ఫీడ్ను అధ్యయనం చేసిన పోలీసులు నిందితుడు తొలుత కాస్తదూరం సందుల్లో నడిచి వెళ్ళినట్లు, ఆపై వివిధ ఆటోలు మారుతూ ఇంటికి చేరినట్లు గుర్తించారు.
సీసీ కెమెరా ఫీడ్ నుంచి సేకరించిన ఫొటోలతో పాటు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు. పలుమార్లు కాకినాడ, యానం వెళ్ళి వచ్చినా నిందితుల ఆచూకీ దొరకలేదు. అయితే నిందితుడితో పాటు తల్లి, సమీప బంధువు శుక్రవారం వారాసిగూడ వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు నిఘా వేసి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఆ తరువాత వారి నుంచి బాధితులకు చెందిన కేజీ బంగారు ఆభరణాలు రికవరీ చేశారు.