కాంగ్రెస్ కు హ్యాండిచ్చి కారెక్కుతున్న గండ్ర దంపతులు ... ఆ పదవుల కోసమేనా ?
తెలంగాణా రాష్ట్రంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుండి టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్ధి పార్టీలను ఖాళీ చేసే పనిలో పడింది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీని దెబ్బ కొడితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని టార్గెట్ చేసుకున్నారు సీఎం కేసీఆర్ . కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినా ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ ఇచ్చి మరీ కారెక్కించుకుంటున్నారు.
పార్టీ మార్పుపై గండ్ర స్పందన .. మల్లు భట్టీ విక్రమార్క , శ్రీధర్ బాబుతో గండ్ర భేటీ
అధిష్టానం బుజ్జగించినా పార్టీ మారనున్న గండ్ర దంపతులు
అధిష్టానం బుజ్జగించినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. చాలా కాలం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పలు ఉన్నత పదవులు అనుభవించిన భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోటానికి సిద్ధం అయ్యారు. కేటీఆర్ తో భేటీ అయ్యి పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. అందుకు కారణం లేకపోలేదు.
పార్టీ మారితే జోడుపదవుల హామీ ...
పార్టీ మారితే ఆయన సతీమణి గండ్ర జ్యోతికి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు గండ్ర వెంకట రమణారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ చీఫ్ విప్ పదవి నిర్వహించారు కాబట్టి ఆయనకు టీఆర్ఎస్ పార్టీలో చేరితే ప్రభుత్వ చీఫ్ విప్ పదవి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది . అందుకే సతీ సమేతంగా పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు గండ్ర .
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన గండ్ర దంపతులు .. త్వరలో టీఆర్ఎస్ లోకి జంప్
ఇక ఈ నేపధ్యంలోనే గండ్ర వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. భర్త గండ్రతో పాటు భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న గండ్ర సతీమణి జ్యోతి కూడా ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు.తనకు అవకాశం ఇచ్చి రాజకీయంగా ప్రొత్సహించినందుకు సోనియా, రాహుల్, ఉత్తమ్, భట్టీ, జానారెడ్డిలకు జ్యోతి ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ మారనని చెప్పిన మరుసటిరోజే కాంగ్రెస్ కు గండ్ర ఝలక్
తన భర్త టీఆర్ఎస్లో చేరుతున్నందున నైతికంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం భావ్యం కాదు కనుక రాజీనామా చేస్తున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి కాంగ్రెస్ నేతలకు పార్టీ మారానని చెప్పి నమ్మించి మోసం చేశారు గండ్ర వెంకట రమణారెడ్డి . అనూహ్యంగా గండ్ర ఇచ్చిన ఝలక్ కాంగ్రెస్ పార్టీని షాక్ కు గురి చేసింది.