ప్రశాంతంగా నిమజ్జనం: ముంబైలో ఆకట్టుకున్న మంచు గణేష్
హైదరాబాద్: భాగ్యనగరం పరిధిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం తెలిపారు. గణనాధుల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. హైదరాబాద్లోని సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్ వద్ద గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు.
కరెంట్ వైర్లు తగిలి ఇద్దరి మృతి
చంపాపేటలో గురువారం వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. రెడ్డి కాలనీ సమీపంలో నిమజ్జనం కోసం వినాయకుడి విగ్రహాన్ని ట్రాక్టర్లో తరలిస్తున్నారు. ఊరేగింపులో పాల్గొంటున్న ఇద్దరు వ్యక్తులకు కరెంటు వైర్లు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై వారు ప్రాణాలు కోల్పోయారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తులను న్యాయవాది వెంకటేశ్వర్లు, సరూర్నగర్ ప్రాంత వాసి సందీప్లుగా గుర్తించారు.
ముంబైలో మంచు గణేషుడు
మట్టితో, కూరగాయలతో, గడ్డితో, కొబ్బరికాయలతో, పండ్లతో... ఇలా రకరకాల గణనాథులను చూస్తుంటాం. ఇంకా బాహుబలి గణేషుడు, కబాలి గణేషుడు, గబ్బర్ సింగ్ గణేషులను కూడా చూశాం. మంచు వినాయకుడిని మాత్రం చూడలేదు. ముంబైలోని స్నో వరల్డ్ థీమ్ పార్క్ నిర్వాహకులు ఈ ఆలోచన చేశారు.
అభయ్, సుశాంత్ అనే ఇద్దరు కళాకారులు మంచు వినాయకుడికి ప్రాణం పోశారు. ఇందుకుగాను సుమారు 300 కిలోల మంచుతో 5.5 మీటర్ల ఎత్తులో తయారు చేసిన ఈ గణనాథుడు కరిగిపోకుండా మండపంలో -10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఏర్పాట్లు చేశారు. మంచు గణనాథుడిని తయారు చేసేందుకు 10 నుంచి 15 రోజుల పాటు శ్రమించినట్లు తెలిపారు.