ఓ ఐడియా జీవితాన్నే మార్చేసింది: మెయిన్ డోర్కు కిటికీలే అతడి టార్గెట్
హైదరాబాద్: ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. నిజమే ఓ ఐడియా ఓ వ్యక్తిని క్రిమినల్గా మార్చేసింది. చెడు తిరుగుళ్లు మానుకోవాలని తల్లిదండ్రులు ఓ యువకుడిని రూములో పెట్టి బయటి నుంచి గొళ్లెం పెట్టారు. దానిని తెరిచేందుకు డోర్కు పక్కనే ఉన్న కిటికీ నుంచి చెయ్యి పెట్టి డోర్ తీశాడు.
ఈ ఐడియా అతనిలో క్రిమినల్ ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అలా మొదలైన ఆ యువకుడి నేరచరిత్ర అతడిని పలుసార్లు జైలుకు పంపింది. అలా జైలులో పెరిగిన క్రిమినల్స్ దోస్తీ ఏకంగా ఆ యువకుడిని హెచ్బీ అఫెండర్గా మార్చేసింది. ఇలా పోలీసులకు వాంటెడ్గా మారిన ఆ యువకుడు రెండు రోజుల కిందట సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీంతో అల్వాల్ పరిధిలో జరిగిన దాదాపు నాలుగు చోరీ కేసుల మిస్టరీ బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. అల్వాల్ బొల్లారం ప్రాంతానికి చెందిన జేమ్స్ అంథోని పాల్(24) జల్సాలకు అలవాటు పడి హెచ్బీ అఫెండర్గా మారాడు. గతంలో పలు చోరీ కేసులలో జైలు వెళ్లొచ్చిన జేమ్స్ తాజాగా ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ బంగారం, నగదును కొట్టేస్తున్నాడు.
రెండు రోజుల కిందట పోలీసులకు దొరికిన క్లూతో అతనిని అరెస్టు చేశారు. జేమ్స్ చోరీ సోత్తును అమ్మేస్తూ అనుచరుడిగా మారిన సమీర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు అల్వాల్ పోలీసులు తరలించారు. వీరి వద్ద నుంచి రికవరీ ఆశించిన స్థాయిలో దొరకలేదు. అయినప్పటికీ... పోలీసులకు మాత్రం నాలుగు కేసుల మిస్టరీ వీడిపోయింది.
జేమ్స్ ఇంటికి మెయిన్ డోర్కు కిటికీలు ఉండే ఇళ్లను టార్గెట్ చేస్తాడని పోలీసు విచారణలో తేలింది. అల్వాల్ పరిధిలో జేమ్స్ పాల్పడిన నాలుగు చోరీలు కూడా ఇలాంటి ఇల్లలోనే చేశాడు. జేమ్స్ అర్ధరాత్రి సమయంలో తన టార్గెట్ ఇంటిని చేరుకుని మొదట కిటికీని తెరుస్తాడు. ఆ తర్వాత ఆ గ్రిల్స్ నుంచి డోర్ తలుపులను తెరిచి లోనికి వెళ్లి డబ్బు ఉండే పరిసరాల్లో వెతుకుతాడు.
అలా ఆ ప్రాంతాల్లో ఏది దొరికినా అక్కడి నుంచి 20 నిమిషాల్లో వెళ్లిపోతాడు. తన జల్సాలకు అవసరం ఉన్నప్పుడల్లా ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన సొత్తును తన స్నేహితుడు సమీర్ అహ్మద్ ఖాన్ ద్వారా జేమ్స్ విక్రయిస్తాడు. ఆ డబ్బుతో బెంగళూరు, గోవాలలో ఫుల్గా ఎంజాయ్ చేస్తారని తేలింది.
జేమ్స్ అల్వాల్ లక్ష్మీ ఎన్క్లేవ్ ప్రాంతంలోని ఓ డూప్లెక్స్ ఇంట్లో చోరీకి వెళ్లాడు. అక్కడ కిటికీ ద్వారా మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్లి ఇంట్లో అన్ని చోట్ల వెదికినా అతనికి ఏమీ దొరకలేదు. దీంతో వెళ్లిపోదామని వస్తుండగా మెయిన్డోర్ పక్కనే గాఢ నిద్రపోతున్న ఇంటి యజమాని దిండు కింద ఓ చిన్న పర్సు కనపడింది.
దానిని ఎటువంటి అలికిడి లేకుండా తీసి జంప్ అయ్యాడని పోలీసు విచారణలో తెలిసింది. ఇలా చెడు అలవాట్లకు బానిసై యువత క్రిమినల్స్గా మారడం పోలీసులకు ప్రతి కేసు ఓ సవాలుగా మారింది. మెయిన్ డోర్ పక్కన కిటికీలు పెట్టుకుని ఉండే ఇంటి యజమానులు వాటికి గ్రిల్స్ అమర్చుకుంటే ఇలాంటి దొంగల మోడస్ అపరెండీకి చెక్ పెట్టవచ్చని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.