జైల్లో అతను: క్లోనింగ్తో కోట్లు కొట్టేసిన ఘరానా ముఠా
క్లోనింగ్ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులతో నగదు డ్రా చేస్తున్నముఠాను సీసీఎస్ సైబర్క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: జైళ్లో ఉన్న వ్యక్తికి సం బంధించిన ఈడీసీ యంత్రాలు (పీఓఎస్) వాడుతూ క్లోనింగ్ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులతో నగదును డ్రా చేస్తూ బ్యాంకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాదు సీసీఎస్ సైబర్క్రైం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు.
వనస్థలిపురానికి చెందిన మహేష్ అబిడ్స్లోని జే అం డ్ కే బ్యాంకులో వ్యాపారాల నిర్వహణ కోసం నాలుగు కరెంటు ఖాతాలు తెరిచాడు. ఆ ఖాతాలకు సంబంధించి బ్యాంకు నుంచి నాలుగు పీఓఎస్ యంత్రాలు తీసుకున్నాడు. అతనిపై ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్లో ఒక దోపిడీ కేసు నమోదు కావడంతో ఆ కేసులో కోర్టు జీవితఖైదీగా శిక్ష పడింది.
మహేష్ అనుచరుడైన కిరణ్కుమార్కు ఆ యంత్రాలను, బ్యాంకు లావా దేవీలకు సంబంధించిన అంశాలను మహేష్ అప్పగించి జైలు కెళ్లాడు. కిరణ్కుమార్కు కర్నూలుకు చెందిన చాంద్పాషా పరిచయం అయ్యాడు. తనకు పీఓఎస్ యంత్రాలు అప్పగిస్తే, వాటి ద్వారా డబ్బులు డ్రా చేస్తామని, వచ్చిన దాంట్లో 10 శాతం కమీషన్ ఇస్తానంటూ చాంద్పాషా, కిరణ్తో ఒప్పందం చేసుకొని, ఆ నాలుగు యంత్రాలను తీసుకున్నాడు.
చాంద్ పాషా వాటిని కేరళకు చెందిన అబూబాకర్కు అందించాడు. కేరళకు చెందిన యూసుఫ్ వద్ద క్లోనింగ్ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు వివిధ చోట్ల నుంచి సేకరించిన కార్డుల డాటా ఉండడంతో అబూబాకర్, యూసుఫ్లు ఆ యంత్రాలను వాడుతూ వస్తున్నారు. ఆ యంత్రాల నుంచి కార్డులు, వాటి వివరాలతో స్వైపింగ్ చేస్తూ లక్షల రూపాయల నగదును డ్రా చేశారు.
తమ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో కొనుగోలు దారులు కార్డులు ఉపయోగించినట్లు క్లోనింగ్ కార్డులను ఉపయోగిస్తూ స్వైపింగ్ చేశారు. ఇలా స్వైపింగ్ చేసిన నగదు అంతా మహేష్ ఖాతాలోకి వెళ్లింది, ఇలా ఖాతాలోకి వచ్చిన నగదును చాంద్పాషా చెప్పే వివిధ ఖాతాలకు కిరణ్కుమార్ బదిలీ చేసేవాడు.
ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈ ముఠా ఈ యంత్రాల నుంచి రూ. 1.1 కోట్ల రూపాయలను డ్రా చేసింది. అయితే కొంతమంది ఖాతాదారులు ఆయా బ్యాంకులకు ఫిర్యాదులు చేయడంతో, డబ్బులు ఏ ఖాతాలోకి వెళ్లాయనే విషయంపై ఆరా తీశారు.
జే అండ్ కే బ్యాంక్లోని ఖాతాలోకి నగదు వెళ్లినట్లు గుర్తించి, ఆ బ్యాంకుకు సంబంధిత డెబిట్, క్రెడిట్ కార్డుల సంస్థలు అక్రమ పద్ధతిలో డ్రా అయిన డబ్బులు వెనక్కి వేయాలంటూ లేఖలు రాయడంతో జే అండ్ కే బ్యాంకు డబ్బులు వెనక్కి ఇచ్చింది. తమ పీఓఎస్ యంత్రాలతో అక్రమాలు చేస్తున్నారంటూ సీసీఎస్ సైబర్క్రైం పోలీసులకు జే అండ్ కే బ్యాంక్ అబిడ్స్ శాఖ హెడ్ అల్దాఫ్ వానీ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే కార్డులో క్లోనింగ్ చేస్తున్నారా, ఆయా బ్యాంకుల నుంచి డాటాను అపహరిస్తున్నారా అనే విషయాలు తేలాలంటే యూసుఫ్ దొరకాల్సి ఉందని దర్యాప్తు జరుపుతున్న ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ తెలిపారు. అబూబాకర్కు హిందీ రాకపోవడంతో మనీఫ్ హమ్జాను ట్రాన్స్లేటర్గా వాడుకున్నాడు, కిరణ్కుమార్ తన అనుచరుడిగా రామ్కుమార్గా పెట్టుకొని బ్యాంకు లావాదేవీలు చేశారు,
స్వైపింగ్ అయిన నగదులో 40 శాతం వరకు కమీషన్ల రూపంలో కోత విధించి మిగతా డబ్బును యూసుఫ్కు పంపించేవారు. ఈ కేసులో కిరణ్కుమార్, అబూబాకర్, హనీఫ్ అమ్జా, రామ్కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన యూసుఫ్, చాంద్పాషాల కోసం గాలిస్తున్నారు.