నకిలీ ఆహార తినిఖీ అధికారుల అరెస్ట్
ఆహార తనిఖీ అధికారులు, సహాయ సిబ్బందిగా పరిచయం చేసుకుంటూ తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేసిన ముఠాను గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
గోదావరిఖని: ఆహార తనిఖీ అధికారులు, సహాయ సిబ్బందిగా పరిచయం చేసుకుంటూ తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేసిన ముఠాను గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
వారి నుంచి నకిలీ రశీదులతో పాటు నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కృష్ణ వివరాలను వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన అద్దంకి మణికంఠ చక్రవర్తి(34), అదే జిల్లా ధనువాయిపేటకు చెందిన ఎస్.కె.అల్తాఫ్ (22), హైదరాబాద్కు చెందిన కోలపల్లి శ్రీధర్(23) అలియాస్ జ్యోతిభాస్కర్ శ్రీధర్, నల్గొండ జిల్లా పెద్ద అడిశాలపల్లికి చెందిన ఒరుసు శ్రీకాంత్(23)లు గత కొంతకాలంగా గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాల్లో ఆహార తనిఖీ అధికారి, సహాయ అధికారులుగా పరిచయం చేసుకుంటూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించుకొని నకిలీ రశీదులతో కిరాణం దుకాణాలతో పాటు ఇతర ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాల్లో తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ దందా సాగిస్తున్నారు. మణికంఠ చక్రవర్తి కొంత కాలం గోదావరిఖనిలో పెట్రోల్ సేవర్ పరికరాలు విక్రయిస్తూ జీవించేవాడు. ఆర్థికంగా పరిస్థితి దెబ్బతినడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.
దీంతో తన ప్రాంతానికి చెందిన అల్తాఫ్, శ్రీధర్లకు తను రూపొందించిన పథకాన్ని వివరించాడు. దానికి వారి నుంచి కూడా సహకారం అందడంతో కారు అద్దెకు తీసుకొని డ్రైవర్గా శ్రీకాంత్ను ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కలిసి నాణ్యత లేని వస్తువులు అమ్ముతున్నారంటూ వ్యాపారులను బెదిరింపులకు గురిచేసేవారు. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే గోదావరిఖని జీఎం కాలనీలోని పేరాల రమేశ్ కిరాణం దుకాణంలో తనిఖీ చేసి, అతని వద్ద రూ. 2,500 వసూలు చేశారు. దుకాణం యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన వారు నకిలీ ముఠాగా గుర్తించి గంగానగర్ వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ అధికారులుగా తేలింది.
వారి నుంచి రూ. 44,500 నగదు, కారు, నకిలీ రశీదులు, నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. ఎస్ఐ మహేందర్తో పాటు సిబ్బంది వారిని పట్టుకోవడంలో కృషి చేసినట్లు ఆయన తెలిపారు. ఎస్ఐలు దేవయ్య, శ్రీనివాసరావు పాల్గొన్నారు.