నేరస్థుల ముఠా పట్టివేత: సూరి వద్ద ఒకతను పని
హైదరాబాద్: కరుడు గట్టిన నేరస్థుల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారంతా హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఓ ముఠాగా ఏర్పాడ్డారు.. వారిపై పలు కేసులున్నాయి. ముఠాలో ఓ సభ్యుడు ఫ్యాక్షనిస్టులు పటోళ్ల గోవర్దన్రెడ్డి, మద్దెల చెర్వు సూరి వద్ద పనిచేశాడు. సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్ వద్ద కూడా పనిచేశాడు. తాజాగా మిర్యాలగూడకు చెందిన వ్యాపారిని హత్య చేసేందుకు రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రభాకర్రావు నిందితుల వివరాలు వెల్లడించారు.
నల్లగొండ సీసీఎస్, మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు మంగళవారం మిర్యాలగూడ సాగర్ రింగ్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా నేరస్తుల ముఠా పట్టుబడింది. వీరి వద్ద ఒక రివాల్వర్, మారుతి మ్యాన్, ఇండికా కారు, రెండు మారణాయుధాలు, రెండు కారం ప్యాకెట్లు, రూ.1.50 లక్షల నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ వ్యాపారిని హత్య చేసేం దుకు పథకం పన్నినట్లు గుర్తించామన్నారు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బుర్జుకాడి విజయ్కుమార్ అలియాస్ విష్ణు, రంగారెడ్డి జిల్లా శివారెడ్డిగూడెం పోలీసు మహేందర్, వరంగల్ జిల్లా మడిపల్లికి చెందిన గుంటుక రమేష్, రంగారెడ్డి జిల్లా జీడిమెట్లకు చెందిన కాసర్ల రాజు ముఠాగా ఏర్పడి వ్యాపారి గోపాల్రెడ్డిని హత్య చేసేందుకు రూ.10 లక్షలు ఒప్పందం చేసుకున్నారు. జిల్లాలోని పెన్పహాడ్ మండలానికి చెందిన నారాయణ పాపిరెడ్డి, నేరేడుచర్ల మండలానికి చెందిన నూకల మధుకర్రెడ్డి, తిప్పర్తి మండలం యల్లమ్మగూడేనికి చెందిన ఉట్కూరి వెంకట్రెడ్డి కలిసి హత్యకు పథకం పన్ని రూ.3 లక్ష 20 వేలు అడ్వాన్స్గా చెల్లించారు. మిర్యాలగూడలో రాఘవేంద్రస్వామి ఐరన్, హార్డ్వేర్ షాపు నిర్వహించే గోపాల్రెడ్డికి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫొటో, షాపు అడ్రసును ఈ ముఠాకు అందజేశారు.
గోపాల్రెడ్డి తన సమీప బంధువైన నారాయణ పాపిరెడ్డికి రూ.5 లక్షలు ఇ వ్వాల్సి ఉన్న విషయంపై కోర్టులో కేసు సాగుతోంది. గత నవంబరులో గోపాల్రెడ్డి నారాయణగూడెం గ్రామానికి వెళ్లడంతో అక్కడే నివాసం ఉంటున్న పాపిరెడ్డి గమనించి తనను చంపడానికి వచ్చాడని భావించాడు. డబ్బులు ఇవ్వకపోగా, హత్య చేసేందుకు పథకం వేశాడని అనుమానించాడు. దీనితో గోపాల్రెడ్డినే హత్య చేసేందుకు పాత నేర చరి త్ర కలిగిన నలుగురు వ్యక్తుల ముఠా మధుకర్రెడ్డి, వారి సమీప బంధువు సందీప్రెడ్డి ఫ్యాక్షన్ నేరస్తుడైన విజయ్కుమార్ను సంప్రదించారు.
ముఠాలో ప్రథమ ముద్దాయి విజయ్కుమార్తో కలిసి పాపిరెడ్డి, మధుకర్రెడ్డి, సందీప్రెడ్డిలు ఒక కారులో వెళ్లి గోపాల్రెడ్డి హ్యత చేసేందుకు ఇంటిని, షాపును రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలో అనుకున్న ప్రకారం విజయ్కుమార్ తన అనుచరులతో మంగళవారం ఉదయం ఓ వ్యాన్లో హత్యకు కావాల్సిన మారణాయుధాలు, కారం ప్యాకెట్లు తీసుకుని హైదరాబాద్ నుంచి ఇబ్రహింపట్నం మీదుగా మిర్యాలగూడ చేరుకున్నారు. గోపాల్రెడ్డి షాపుకు కొద్ది దూరంలో వ్యాన్లో ఉన్న వీరందరినీ పోలీసులు పట్టుకున్నారు. ముఠా హత్య ప్రయత్నానికి కారకులైన వారిని సీసీఎస్ డీఎస్పీ సునీతా మోహన్, సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు.